తాల్ సంక్రాంతి సంబరాలు 2021: తొలిసారి ఆన్లైన్లో వేడుకలు
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం(జనవరి 17న)నాడు గత ఏడాదికి భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారంలో ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది తెలుగువారు వీక్షించారు.
తాల్ ఛైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్కి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబోస్ తన ఉపన్యాసం, గానంతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
మరుగున పడుతున్న కళలను ప్రోత్సహించడం, కొత్త తరానికి తెలియజెప్పడం, వాటి మీద ఆధారపడి బతుకుతున్న కళాకారులను ఆదుకోవడం కోసం.. తాల్ తమ వంతుగా కర్యవ్యంగా తెలుగు జానపద కళారూపాల్ని ప్రదర్శించారు. హరదాసు హరినామ సంకీర్తనతో గంగిరెద్దులు తమ ఆటలతో, సన్నాయిమేళం పాటలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. యాదవల్లి శ్రీదేవి బృందం ప్రదర్శించిన సంక్రాంతి బుర్రకథ విపులంగా, వినోదాత్మకంగా సాగింది. బుడబుక్కలవారు తమ ఆశీర్వాదాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. యాదవల్లి చిరంజీవి మిరియాల ప్రశాంత్ బృందం 'పిట్టలదొర' ఆద్యంతం హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకున్నారు.
తాల్ సాంస్కృతిక కేంద్రం(టీసీసీ) అధ్యాపకురాలు వీణాపాణి కోన భక్తిరస శాస్త్రీయ సంగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, టీసీసీలో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న చిన్నారుల కీర్తనలు, యామిని శాతవల్లి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కళ్యాణి తన ఉత్సాహకరమైన యాంకరింగ్తో కార్యక్రమాన్ని ఆద్యంతం సాఫీగా నడిపించారు.
తాల్ సంక్రాంతి సంబరాలు(వీడియో)
చంద్రబోస్ తన సినీప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గాయనీగాయకులు స్వాతిరెడ్డి, కారుణ్య పచునూరి, సలోని బోయిన, మౌనిక బొజ్జా, ఐశ్వర్య కందుకూరి, భగవాన్ బోయినపల్లి, ఆదిత్యశివానంద్ మల్లాది తదితరులు చంద్రబోస్ రచించిన పాటల సమాహారం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చంద్రబోస్ వారిని అభినందనలతో ముంచెత్తారు. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని సినీ గేయాలు ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ వైస్ ఛైర్మన్ రాజేష్ తోలేటి ముఖ్య అతిథి చంద్రబోస్,, జానపద కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ వీడియో సందేశం ద్వారా లండన్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత 15ఏళ్లుగా తాల్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.
అంతర్జాలం వేదికగా జరిగిన ఈ సంబరాలకు సాంకేతిక బాధ్యతలను ట్రస్టీ కిషోర్ కస్తూరి నిర్వహించారు. ట్రస్టీ నవీన్ గాదంసేతి సాంస్కృతిక కార్యక్రమ బాధ్యతలు నిర్వహించగా, ఇతర ట్రస్టీలు రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూరు, అనిల్ అనంతుల, అనిత నోముల, సాంకేతిక బృందం సభ్యులు రిషి కొత్తపేట, గౌరీ ఆదిమూలం, జశ్వంత్ కుంపట్ల, అశోక్ మాడిశెట్టి, శ్రీహరి అరిగె తమవంతు సహకారం అందించి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు.