అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థినికి తీవ్రగాయాలు
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్నస్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ ఆ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్నస్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన విద్యార్థిని కొల్లూరు శ్రీలేఖ ఆ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
తలకు బలమైన దెబ్బ తగలటంతో శ్రీలేఖకు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరు సురేష్, సుమతిలు కొన్నిసంవత్సరాలుగా మధిరలోని ఆజాద్ రోడ్డులో నివాసముంటూ పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని నడుపుతున్నారు.
వీరి కుమార్తె శ్రీలేఖ మూడునెలల క్రితం అమెరికా వెళ్లి న్యూయార్క్ సిటీలోని స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ లో చేరింది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 7 గంటలకు(అక్కడ రాత్రి 9 గంటలకు) కళాశాల నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శ్రీలేఖను ఐసీయూలో ఉంచినట్లు సమాచారం. ఇండియన్ కౌన్సిల్ ద్వారా శ్రీలేఖకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అక్కడికి వెళ్లిన తోటి విద్యార్థి హైదరాబాద్కు చెందిన శ్రవణ్ తెలిపారు.
కుటుంబాన్ని పరామర్శించిన తాతా మధు
శ్రీలేఖ కుటుంబసభ్యులను తానా మాజీ కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు పరామర్శించారు. శ్రీలేఖ తల్లిదండ్రులు సుమతి, సురేష్లతో ఆయన మాట్లాడారు. తానా ప్రస్తుత కార్యదర్శి తాళ్లూరి జయశేఖర్ను అడిగి అక్కడ శ్రీలేఖ పరిస్థితిని తెలుసుకున్నారు.
తానా అసోసియేషన్ పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి మెరుగ్గానే ఉందని శ్రీలేఖ తల్లిదండ్రులకు మధు ధైర్యం చెప్పారు.