హుదూద్ తుఫాన్ బాధితులకు కువైట్ 'తెలుగు కళాసమితి' రూ. 15.42 లక్షల విరాళం
హైదరాబాద్: కువైట్లో అతి పురాతన, ప్రాచుర్యమైన తెలుగు సంఘాల్లో ఒకటైన 'తెలుగు కళా సమితి' విశాఖపట్నం హుదూద్ తుఫాన్ బాధితుల కోసం రూ. 15.42 లక్షల విరాళాన్ని అందించారు. తెలుగు కళా సమితి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కలిసి వివిధ కార్యక్రమాలకు తన వంతు సహాకారం అందిస్తుంది.
ఇండియాలో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కువైట్ తెలుగు కళా సమితి స్పందిస్తున్న తీరు అధ్భుతం. ఉత్తరాంధ్ర జిల్లాలు హుదూద్ తుఫాన్ వల్ల అతలాకుతలమవడంతో వారికి సాయం చేసేందుకు తెలుగు కళా సమితి ముందుకొచ్చింది. తుఫాను బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ. 15.42 లక్షల విరాళం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.
తెలుగు కళా సమితి ఇంతటి సాయాన్ని చేసేందుకు కారకులైన వారిలో తెలుగు కళా సమితి సభ్యులు త్రిమూర్తులు గారు, సిరికి రవి శంకర్ గారు, బాలా చంద్రుడు గారు, మురళీ కృష్ణ గారు, ఆచంటి భాస్కర్ గారు, కృష్ణా రావు గారు, భాస్కర్ పెనుమచ్చ తదితరులు ఉన్నారు.
ఈ విరాళాల కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ నరసింహా రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు గారు, జనరల్ సెక్రటరీ వెంకట శివ రావు కోడూరి, జాయింట్ సెక్రటరీ కొర్రపాటి వెంకటేష్, ట్రెజరర్ అన్నాజీ శేఖర్లు చూపించిన కృషి మరువలేనిది.
హుదూద్ తుఫాన్ బాధితుల కోసం సేకరించిన రూ. 15.42 లక్షల విరాళంలో రూ. 14.42 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా బదిలీ చేశామన్నారు. మిగతా రూ. లక్ష చెక్ను డిసెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి ఇవ్వనున్నట్లు కువైట్ తెలుగు కళా సమితి జనరల్ సెక్రటరీ వెంకట్ కోడూరి, ట్రెజరర్ అన్నాజీ శేఖర్ తెలిపారు.