తాజ్ ఆధ్వర్యంలో జెడ్డాలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు..
అర్ధ రాత్రి వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు 200 తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి.
జెడ్డా: విదేశాల్లో ఉన్నా తెలుగు భాషను మర్చిపోకుండా.. తెలుగు సంస్కృతికి ఎన్నారైలు పెద్దపీటవేస్తున్నారు. సౌదీ అరేబియాలోనే జెద్ధా తెలుగు సంఘం (తాజ్) అధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. అర్ధ రాత్రి వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దాదాపు 200 తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి.
తెలుగు భాష కోసం ప్రవాసులు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల ప్రవాసీయులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. విదేశాల్లో ఉంటూ కూడా మాతృభాషను పిల్లలకు నేర్పించడానికి తెలుగు కుటుంబాలు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ ప్రవాసీ మార్గదర్శకుడు యల్. రాంనారాయణ్ అయ్యర్ కొనియాడారు.
సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర గురించిన అంశాలను తెలియజేసేలా తెలుగు భాషను నేర్పించాలని ఆయన సూచించారు. కాలక్రమేణా మాతృభాషలు కనుమరగవుతున్నాయని రాం అయ్యర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణ కోసం తమ ఇంట్లో ఉన్న వందలాది తమిళ పుస్తకాలను గ్రంధాలయానికి విరాళ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాతృభాష నేర్చుకుంటే స్వదేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత పిల్లలకు సామాజికంగా ఇబ్బందులు ఎదురుకాబోవని ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్కు చెందిన కాన్సుల్ షహాబోద్దీన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధితో ప్రాంతాల మధ్య దూరం తగ్గుతోందన్నారు.
అయినా ఇప్పటికీ అనేక మంది తెలుగు వాళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారి మధ్య 'తాజ్' వారధిగా ఉండటం సంతోషకరమని ప్రొఫెసర్ సత్యవాణి అన్నారు. తాజ్ సహకారంతో తెలుగు వారందరు కలిసి ఒక కుటుంబంగా ఉంటున్నారని అమె కొనియాడారు.
పరాయి దేశంలో తెలుగు ప్రవాసీయుల మధ్య దూరం తగ్గి పరస్పర సహాకారం అందించుకోవాలని సత్యవాణి కోరారు. కాలక్రమేణా భాష ఔన్నత్యం కోల్పోతోందని తాజ్ డాక్టర్ల విభాగానికి చెందిన డాక్టర్ బుచ్చి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతుందని, అనేక ఆంగ్ల పదాలు వచ్చి చేరుతున్నాయని ఆయన అన్నారు.
సౌదీ అరేబియాలోని రాజకుటుంబానికి ప్రత్యేక వైద్యుడు, సౌదీ పౌరుడైన డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా తెలుగు భాష ఔన్నత్యం గూర్చి తెలుగులో వివరించడంతో సభికులు అశ్చర్యానికి గురయ్యారు. తెలుగు గడ్డపై పుట్టి పెరిగి తెలుగులో చదువుకొన్న తాను తర్వాత సౌదీకు వచ్చి స్ధిరపడ్డానని వివరించారు. పవిత్ర ఖురాన్ను తాను అరబ్బి నుండి తెలుగులోకి అనువదించానని చెప్పారు.
సౌదీలోని పశ్చిమ ప్రాంతంలో 2 లక్షలకు పైగా మంది తెలుగు ప్రవాసీయులు ఉంటున్నా సంఘటిత తెలుగు శక్తిగా ఇంకా ఎదగాల్సి ఉందని తాజ్ అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. సామాజిక, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళాదర్శిని, ప్రత్యేకంగా తెలుగు భాష వ్యాప్తి కోసం 'తాజ్ బడి' అనే కార్యక్రమాన్ని కుంట సాగర్ నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లుగా ఆయన సభకు వెల్లడించారు.
దూర ప్రాంతాలలో తెలుగు ప్రవాసీయుల కొరకు కృషి చేస్తున్న కాశీ రాజ్యం (యాన్బూ) షబ్బీర్ ఆలం (అల్ లీత్) శేషు కుమార్ (రాబీఖ్) సలీం భాష (జిజాన్) లను ప్రత్యేకంగా అభినందించారు. తాజ్ కార్యవర్గ సభ్యులను నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ ప్రవాసీ అబ్దుల్ ఖాదన్ అఫ్పాన్ ప్రత్యేకంగా మెమోంటోలు ఇచ్చి అభినందించారు.
స్వచ్ఛందంగా తెలుగు భాషను నేర్పిస్తున్న తెలుగు బడి ఉపాధ్యాయులు భారతీ, నసీమా సుల్తాన, హరిణిలకు ప్రత్యేక ఆవార్డులను ప్రదానం చేశారు. వృత్తిరీత్యా అధ్యాపకులుగా పని చేస్తున్న తెలుగు ప్రవాసీయులైన రామ సీత, సమీరా రహెమాన్, ఛాయ, సురేఖ, శారద, అరుణను కూడ ఈ సందర్భంగా అభినందించారు.
చిన్నారులు రేవంత్ కృష్ణ సాయి, రాహీల్, జయవర్ధన్, అహానా, శ్రీ ప్రణిత్, రాహుల్, తాహా, అరవింద్, ఇమ్రాన్, సరసీ రుహా, దక్ష, రుహీనా, సనా, ఆయాన్, ఇస్రార్, మెఘజ్, మనవీత్, వేదన్, నేహ శ్రీ సాయి, సుమకీర్తన, సాయి నిదీష్ వివిధ పాత్రాలలో పోషించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో రజనీ శ్రీ హరి, దుర్గా భవానీ, శారద, వి. లక్ష్మి మరియు సమీరా రహెమాన్, భారతీలు కీలక పాత్ర వహించారు. ప్రముఖ గాయకుడు అంజద్ హుస్సేన్ పాడిన పాటలు సభికులను ఆలరింపజేశాయి. తాజ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, ప్రముఖులు యాదుమూర్తి, కిరణ్ కాశీభట్ల, శ్రీ హరి, పవన్ కుమార్ పొన్నడ, సిద్దిపేట ఇర్ఫాన్, శేఖ్ జానీ బాష, నానాజీ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.