అమెరికాలో తెలుగు యువకుడు మృతి: ప్రమాదవశాత్తు సరస్సులో గల్లంతు..
న్యూయార్క్: స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్కు వెళ్లిన అనూప్ తోట(26) అనే తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇండియానాలోని బ్లూమింగ్టౌన్ సమీపంలో ఉన్న మాన్రో సరస్సులో అతను గల్లంతయ్యాడు.
బోటింగ్ అనంతరం అనూప్ సరదాగా ఈతకొట్టాడని ఈ క్రమంలోనే సరస్సులో గల్లంతయ్యాడని స్నేహితులు వెల్లడించారు. అనూప్ గల్లంతవడంతో 911 నంబరుకి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ సిబ్బంది సరస్సులో గాలించగా 2రోజుల తర్వాత అనూప్ మృతదేహం లభ్యమైంది. అనూప్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనూప్ స్నేహితులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఈత కొడుతున్న సమయంలో పెద్ద అల అతన్ని బలంగా ఢీకొట్టడంతోనే అతను మునిగిపోయాడని, ఆ తర్వాత అతను కనిపించలేదని వారు వాపోయారు. అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి గో ఫండ్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు.