అమెరికాలో ఉంటూ అమెరికాపైనే: ఎన్నారై స్వాతి దేవినేనిపై కేసు: ధ్వేషపూరిత వ్యాఖ్యల ఫలితం
న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అమెరికాలో 22 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు. అయిదున్నర లక్షల మందిపైగా అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. గంటగంటలకూ అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య అంచనాలకు మించిన విధంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తెలుగు ఎన్నారై స్వాతి దేవినేనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణం కింద న్యూజెర్సీలో ఆమెపై కేసు నమోదైంది.
Recommended Video
స్వాతి దేవినేని స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా. చాలాకాలంగా ఆమె న్యూజెర్సీలో నివసిస్తున్నారు. ఒకట్రెండు తెలుగు న్యూస్ ఛానళ్లకు యాంకర్గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయాాన్ని ప్రస్తావిస్తూ ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని, ఈ విషయంలో భారత్ అద్భుత పనితీరును కనపరుస్తోందని చెప్పారు. కరోనా వైరస్ చికిత్సలో అమెరికా సైతం భారత్పై ఆధారపడిందని, మేరా భారత్ మహాన్ అంటూ కామెంట్స్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీన్ని చూసిన శ్రవణ్ అనే తెలుగు ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగులో స్వాతి దేవినేని చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఆయన వారికి వివరించారు. లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.
శ్రవణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్వాతి దేవినేనిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన కూడా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికాలో ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనపై కేసు నమోదు కావడంతో స్వాతి దేవినేని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూరకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.