గల్ఫ్ దేశాల్లో లో బలిపీఠంపై తెలుగు వారు .. గల్ఫ్ బాధితుల గోస పట్టించుకునే నాధుడే లేడా ?
పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు బలిపీఠంపై నిల్చుంటున్నారు. అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతుంది. ఉన్న ఊరు కలిసిరాక, కరవు రక్కసి కాటేసిన చాలా ప్రాంతాల ప్రజలు గల్ఫ్ లో పొట్ట పోసుకునేందుకు వెళుతున్నారు. కానీ అక్కడ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక, శారీరక మానసిక హింసకు గురవుతున్నారు అక్కడి తెలుగువారు.
సెక్రటేరియట్ నిర్మాణంపై తెలంగాణా సర్కార్ కు హై కోర్ట్ షాక్ .. ఎందుకు కడుతున్నారో చెప్పండి ?
గల్ఫ్ లో నానాటికీ పెరుగుతున్న తెలుగు వలస జీవుల మరణాలు
కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొందరు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వేలాదిమంది అక్కడ పని చేస్తున్నారు. వీరిలో గత మూడేళ్లలో విదేశీ వ్యవహారాల శాఖ డేటా ప్రకారం అధికారికంగా 1656 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక అనధికారికంగా ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో చెప్పలేని పరిస్థితి . గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పని చేస్తున్న తెలుగువారు అక్కడ వెట్టిచాకిరికి గురవుతున్నారు. యజమానుల హింసకు గురవుతున్నారు. ఇటు తెలంగాణా రాష్ట్రంలోనూ , కడప, చిత్తూరు, గోదావరి జిల్లాలకు చెందిన చాలామంది గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం 1656 మంది మృతి .. ఆందోళనకరంగా పరిస్థితి
గత మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1656 మంది చనిపోతే ఒక్క కువైట్ లోనే ఎన్ని మంది చనిపోయారని తెలుస్తుంది. ఇక యూఏఈలో 351 మంది, సౌదీ అరేబియాలో 478 మంది, ఒమన్ లో 153 మంది, ఖతార్ లో 108 మంది, బెహ్రయిన్ లో 78 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో, రోడ్డు ప్రమాదాలతో, శారీరక మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరణిస్తున్న వీరి కోసం రాయబార కార్యాలయాలు లేబర్ క్యాంపుల్లో నిర్వహిస్తున్నాయని కార్మిక శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ లోక్సభకు తెలిపారు. తెలుగు ప్రజల మరణాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ వలస ప్రజల బ్రతుకు చిత్రం మాత్రం మారడం లేదు. ఆందోళనకర రీతిలో మరణాలు సంభవించటం మాత్రం ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది.
కాపాడండి అంటూ వేడుకోలు .. పాలకుల పట్టింపు లేక గల్ఫ్ బాధితుల ఆవేదన
ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు బాసటగా నిలుస్తామని చెబుతున్నా ఆశించిన మేరకు వారికి సహకారం అందడం లేదన్నది తేటతెల్లమవుతుంది. అక్కడ వేధింపులకు గురవుతున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు తమని కాపాడండి అంటూ పలు వీడియో మెసేజ్ లు పంపుతున్న సందర్భాల్లో మాత్రం స్పందిస్తున్న ప్రభుత్వాలు వారిని భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ వెట్టి చాకిరీ చేస్తూ అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా పెద్దగా జరగడం లేదు. చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ వారి జాడ తెలియడం లేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ పరిస్థితుల పై దృష్టి సారించి గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికుల సంరక్షణ కోసం మన విదేశాంగ శాఖ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.