ఎబోలా వ్యాధితో కెన్యాలో తెలుగు టెక్కీ మృతి?
నైరోబి: కెన్యాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఎబోలా వ్యాధితో చనిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. జిల్లాలోని పూతలపట్టు మండలం చిదిపిరాళ్లకు చెందిన గజేంద్రరెడ్డి విష జ్వరంతో నాలుగురోజుల క్రితం కెన్యాలో మరణించాడు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న గజేంద్రరెడ్డికి విషజ్వరంతో పాటు ఒళ్లంతా బొబ్బలు రావడంతో చనిపోయాడని సమాచారం. అయితే, ఎబోలా వ్యాధితో గజేంద్రరెడ్డి చనిపోయాడని పుకార్లు వస్తున్నాయి. ఆయనకు చికిత్స చేసిన డాక్టరు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.
గజేంద్రరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం అతడి భార్య ఇండియాకు బయలుదేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నైరోబీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
ఈ నెల 4వ తేదీన గజేంద్ర రెడ్డి ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరాడు. 14వ తేదీ నుంచి కోమాలోకి వెళ్లిపోయిన అతను 18వ తేదీన మరణించాడు. గురువారం ఉదయం పది గంటలకు గజేంద్ర రెడ్డి భార్య, కూతురు బెంగళూర్ వచ్చారు.