రాఖీ పండుక్కి రాలేకపోతున్నా, మిస్ యు: మెసేజ్ పెట్టిన గంటల్లోనే చికాగోలో ప్రమాదంలో మృతి
ఖమ్మం: రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడిని మిస్ అవుతున్నానని చెప్పిన కొద్ది గంటల్లోనే ఓ తెలుగు మహిళ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన స్వర్ణ మృతి చెందారు.
రాఖీ పండుగకు నీ దగ్గరకు రాలేకపోతున్నానని, బాధగా ఉందని, నిన్ను మిస్ అవుతున్నానని తన సోదరుడికి మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత భర్త కిరణ్ కుమార్, కూతురు బిందుతో కలిసి స్వర్ణ కారులో ప్రయాణిస్తోంది. అప్పుడు స్వర్ణ కారు నడుపుతున్నారు.
వీరి కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్వర్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
కూసుమంచికి చెందిన వ్యాపారి రఘునాథ రావు కుమార్తెకు విజయవాడకు చెందిన వ్యాపారి కుమారుడు కిరణ్ కుమార్తో పదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి తొమ్మిదేళ్ల కూతురు బిందు ఉంది. సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న కిరణ్ ఏడాదిగా చికాగోలో ఉంటున్నారు. భార్య, కూతురు నాలుగైదు నెలల క్రితమే చికాగో వెళ్లారు. సినిమాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.