అమెరికా కాల్పుల ఘటన:తెనాలి యువకుడి మృతితో తీవ్ర విషాదం...పాపం!...త్వరలోనే పెళ్లి
గుంటూరు:అమెరికాలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన కందేపి పృధ్వీరాజ్(26) ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడ చదువు పూర్తి చేసి సిన్సినాటిలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఉద్యోగులంతా బయటకు వస్తున్న సమయంలో వీళ్లపై దోపిడీ దొంగ గా భావిస్తున్న దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పృథ్వీరాజ్తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పృథ్వీరాజ్ మృతి చెందిన విషయం తెలిసి తెనాలిలో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పృథ్వీరాజ్ తండ్రి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం అమరావతిలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కుమారుడు పృథ్వీరాజ్తో పాటు మరో కుమార్తె సంతానం. కుమారుడు అమెరికాలో స్థిరపడటంతో త్వరలోనే వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఏం జరిగిందంటే...సిన్సినాటిలోని వాల్నట్ స్ట్రీట్లోని బ్యాంక్లోని ఉద్యోగులపై గురువారం ఉదయం ఆకస్మాత్తుగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడు అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అతడిని ఒమర్ పెరాజ్ అనే స్థానికుడి పోలీసులు గుర్తించారు.
మరోవైపు ప్రమాద ఘటనపై మృతుడి బంధువులు...అమెరికాలోని తెలుగు సంఘాలు, బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని వారు కోరుతున్నారు.