13వ కాన్ఫరెన్స్: 3 రోజులపాటు ‘ఆటా’ సంబరాలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 13వ సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు ముమ్మరం చేశారు. ఈ సమావేశాలకు భారత్, కెనడా, బ్రిటన్ నుంచి సుమారు 10వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశం అమెరికాలోని పెన్సిల్వెనియాలోని ఫిలడెల్ఫియాలో జరగనుంది.
మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు బుధవారం(జులై 3న) ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభం కానున్నాయి. తెలుగు సాంప్రదాయానికి తగినట్లుగా సమావేశ మందిరాన్ని తీర్చిదిద్దారు. జులై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో అక్కడ మరింత సందడి నెలకొననుంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఇండియన్-అమెరికన్ మిస్ యూఎస్ఏ నీనా దవులూరి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆమెతోపాటు పలువురు ప్రముఖులు, భారత్ నుంచి పలు రాష్ట్రాల మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. గరికపాటి రామ్మోహన్ రావు, జొన్నవిత్తుల, సినీ రచయిత అనంత్ శ్రీరామ్, కవి ఆచార్య కె వెంకటరెడ్డి, రయిచలు శారదపూర్ణ సొంటి, సత్యం ఉపద్రష్ట లాంటి ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.
మహిళా దినోత్సవం, ‘సామాజిక సేవ' వంటి అంశాలపై సమావేశంలో ప్రత్యేక స్థానం కల్పించనున్నారు. ప్రవాస తెలుగు వారందరూ ఇలా ఒకే చోట చేరి సమావేశమవడం ఓ పెద్ద పండగల ఉంటుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ పరమేశ్ భీరంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘుమ ఘుమలాడే తెలంగాణ, సీమాంధ్రలకు చెందిన వివిధ వంటకాలను కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.