పుణ్యానికి పోతే...! వరంగల్ చిన్నారిపై అత్యాచారానికి నిరసన చేద్దామని.. జైలు పాలైన ప్రవాసాంధ్రులు!?
మంచి చేస్తే చెడు వెంట వచ్చింది అన్న చందంగా తయారైంది కువైట్ లోని ప్రవాసాంధ్రుల పరిస్థితి . వరంగల్ లో తొమ్మిదినెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులు జైలు పాలయ్యారు. నిరసన తెలపటం నేరం అని తెలియక వారు చేసిన పనితో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళన
కువైట్ లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్యకు నిరసన.. గల్ఫ్ దేశాల చట్టాలు తెలియక బుక్ అయిన తెలుగువారు
వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్యకు నిరసనగా శుక్రవారం కువైట్ లోని మాల్వియాలో ప్రవాసాంధ్రులు కొందరు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకున్న 24 మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్ట్ చేశాయి. కువైట్ దేశంలో ఉంటూ అక్కడ చట్టాలు తెలియకపోవటం ప్రవాసాంధ్రుల పాలిట శాపంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో స్పందించాలి అనుకుంటే ఇప్పుడు అదే వారికి పెద్ద నేరమై కూర్చుంది. రాచరిక వ్యవస్ధ ఉన్న కువైట్ సహా ఏ గల్ఫ్దేశంలోనైనా నిరసన, సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్ర నేరం. దీనికి జైలుశిక్షతో పాటు శిక్ష పూర్తయిన తర్వాత వీసా రద్దుచేసి ఏ గల్ఫ్ దేశంలోనూ అడుగు పెట్టకుండా జీవితకాల నిషేధం విధిస్తారు.
చిన్నారి మృతిపై సామాజిక మాధ్యమాల ద్వారా నిరసన తెలియజేసిన ప్రవాసాంధ్రులు
ఇక ఈ విషయం తెలియని ప్రవాసాంధ్రులు నిరసన తెలియజేసి అడ్డంగా బుక్కయ్యారు. కువైట్ లోని ప్రవాసాంధ్రులకు తెలుగు రాష్ట్రాల సమాచారాన్ని విస్తృతంగా అందించే కడప జిల్లాకు చెందిన యువకులు మాధ్యమాల ద్వారా ఏ సమాచారాన్నైనా ఇస్తుంటారు. అయితే వరంగల్ ఘటనపై నిరసన తెలపాలని తద్వారా మరింత మంది ఈ ఘటనపై మాట్లాడేలా నేరస్తుడికి శిక్ష పడేలా చెయ్యాలని శుక్రవారం సాయంత్రం మాల్వియాలోని షెరాటన్ హోటల్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేయాలని భావించిన యువకులు నిరసన ప్రదర్శనను సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసి మరికొందరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. శుక్రవారం సెలవు కావడంతో చాలా మంది ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు .
అరెస్ట్ చేసిన పోలీసులు .... ప్రవాసాంధ్రుల విచారణ
సుమారు 50మంది ఆ ప్రాంతంలో నిరసనలో పాల్గొన్నారు. కువైట్ సహా గల్ఫ్ దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో తెలుగు సహా విదేశీ భాషల్లో జరిగే సమాచార మార్పిడిని అమన్ అల్ దౌలా అనే అత్యున్నత స్ధాయి నిఘా సంస్ధ పరిశీలిస్తుంటుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రవాసాంధ్రుల కార్యకలాపాలపై నిఘా ఉంచిన అమన్ అల్ దౌలా క్షేత్రస్ధాయిలో పోలీసులను అప్రమత్తం చేయడంతో 15 వాహనాల్లో అక్కడికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారిలో కొందరిని అమన్ అల్ దౌలా కస్టడీలో ఉంచి విచారిస్తుండగా, మరికొందరిని పలు పోలీసుస్టేషన్లలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇక అరెస్టయిన వారిని కలిసేందుకు భారతీయ దౌత్య వర్గాలు గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా నిఘా అధికారులు అనుమతించడం లేదని తెలిసింది.