ఓటు హక్కు లేదు: ఎన్నారై ఎలా ఎంఎల్ఏ అయ్యాడు?
న్యూఢిల్లీ: నైస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, కర్ణాటకలోని బీదర్ దక్షిణ శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు అశోక్ ఖేణి పౌరసత్వానికి సంబంధించి విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అశోక్ ఖైణికి భారతదేశంలో ఓటు హక్కు లేదని, అతని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.
అశోక్ ఖైణి అమెరికా పౌరసత్వం పొందాడని, అతనికి కర్ణాటకలో ఓటు హక్కు లేదని, ఓటరు కాదని, అయినా కర్ణాటకలోని బీదర్ దక్షిణ శాసన సభ నియోజక వర్గం నుండి పోటి చేసి శాసన సభ్యుడిగా ఎన్నిక అయ్యారని, ఆయన పదవిని రద్దు చెయ్యాలని ఆర్ టీఐ కార్యకర్త టి.జే. అబ్రహాం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టడానికి అంగీకరించింది. శాసన సభ్యుడు అశోక్ ఖైణికి నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేశారు. గతంలో అశోక్ ఖైణికి కర్ణాటకలో ఓటు హక్కు లేదని టీ.జే. అబ్రహాం కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు 2014లో అబ్రహాం సమర్పించిన అర్జీని కొట్టివేసింది. తరువాత అబ్రహాం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అశోక్ ఖైణి 2013లో జరిగిన శాసన సభ ఎన్నికలలో బీదర్ దక్షిణ శాసన సభ నియోజక వర్గం నుండి కర్ణాటక మక్కల్ పార్టీ (ఖైణి సోంత పార్టీ) తరుపున పోటి చేసి గెలుపొందారు.
అశోక్ ఖైణి నకిలి ఓటరు కార్డు పెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అశోక్ ఖైణి నైస్ సంస్థను స్థాపించి వ్యాపారం చేస్తున్నాడు. అంతే కాకుండ పలు సినిమాలను నిర్మించాడు. సినీతారలు ఆడే క్రికెట్ టీం (సీసీఎల్) కర్ణాటక బుల్డోజర్స్ కు ఈయనే బాస్.