తానా సభలకు వాషింగ్టన్ డీసీ ముస్తాబు..! ప్రముఖులకు అందుతున్న ఇన్విటేషన్లు..!!
హైదరాబాద్: అమెరికాలో తెలుగు పండుగల సీజన్ మొదలైంది. అందుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. మూడు రోజుల పాటు వీనుల విందుగా జరిగే ఈ సాంస్క్రుతిక కార్యక్రమాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశంలో ఇప్పుడున్న జనరేషన్ కి తెలుగు సంస్కృతి ని అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు సాగుతుంటాయి. తెలుగింటి రుచులు కూడా ఈ మూడు రోజుల పాటు ప్రవాస భారతీయ భోజన ప్రియులను ఊరించబోతున్నాయి.
అందుకోసం తానా మహాసభల సందడి మొదలు కాబోతోంది. 2019 జులై 4 నుంచి 6 వ తేదీ వరకు ఘనంగా జరిగే ఈ వేడుకలకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ను కలిసి ఆహ్వానం అందించిన తానా .... తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించింది. ఆయన అంగీకారం తెలిపినట్టు సతీష్ వేమన ప్రకటించారు. వెంకయ్యనాయుడుతో పాటు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈసారి తానా మహాసభలు వాషింగ్టన్ డీసీ నగరంలో జరగనున్నాయి. తొలిసారి తానా వేదికపై శ్రీవారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండేళ్లకు ఒకసారి తానా మహాసభలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి 22వ మహాసభలు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా ఘనంగా జరుపుకునే వేడుక ఇది. అమెరికా తెలుగు సంఘాల్లో మొదటి సారి ఆవిర్భవించిన సంఘం తానాయే.
ఈ సారి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో కేటీఆర్ తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహా సభల అధ్యక్షుడు సతీష్ వేమన ఆహ్వాన పత్రిక అందించారు.