తానా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సాంస్కృతిక మహోత్సవంను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్ళూరి అధ్వర్యంలో వివిధ దేశాలలోని 100 కి పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో మొదలుపెట్టిన "ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం" అట్టహాసంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రారంభమైంది.పూర్తిగా వర్చువల్ పద్దతిలో వెబ్-ఎక్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్ , పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ , లావు క్రిష్ణ దేవరాయులు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అధికార బాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ , ఆంధ్రప్రదేష్ మాజీ ఉప శాసనసభాపతి మండలి బుద్ద ప్రసాద్ గారు, తెలంగాణ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకృష్ణ గారు, సెంట్రల్ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస రావు గారు, డాక్టర్ ఓలేటి పార్వతీశం , ఏపి.ఎన్నార్టీ.ఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.
గత 20రోజులుగా ఆన్ లైన్ పద్దతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగగా 18000 పైగా అభ్యర్దులు 40 కి పైగా దేశాలనుండి 33 వివిధ పోటీలలో పాల్గొనటానికి దరఖాస్తు చేసుకున్నారు. జులై 24, 25 మరియు 26 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో 500 మంది పైగా కోఅర్డినేటర్లు 600 మంది పైగా న్యాయనిర్ణేతలు పాల్గొంటున్నారని కన్వీనర్ తూనుగుంట్ల శిరీష తెలిపారు. జాతీయగీతం ఆలపించటంతో ప్రారంబమయిన సభలో తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి స్వాగతోపన్యాసం చేస్తూ పదహారణాల తెలుగు తనానికి నిదర్శనమయిన పంచె కట్టులో ఉప రాష్ట్రపతి గారిని చుస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు.
డిజిటల్ వేదికపై జరిగిన ఈ ప్రారంబోత్సవ సభలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు బాషా సంస్కృతులను కొనియాడారు. పోటీలు జరుగుతున్న ఎనిమిది ప్రధాన అంశాలు కూడా తెలుగు జీవన విధానానికి, ఆలోచనాసరళికి, సంసృతికి అద్దం పట్టే విధంగా వున్నాయంటూ పద్యం, సామెత, పరభాషలేని పలుకు, కళాకృతిలో ముగ్గులు అల్లికలు, కట్టు బొట్టు అన్నివిభాగాల పేరును ప్రస్తావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన తానా అధ్యక్షులు జయ తాళ్ళూరిని సమన్వయకర్త తూనుగుంట్ల శిరీషను అభినందించారు.
శిరీష గారి తెలుగు ఉచ్చారణ చాలా బాగుందని ప్రత్యేకించి ప్రశంశించారు. ఈ కార్యక్రమాన్ని మహోత్సవం అనేకంటే తిరునాళ్ళు అంటే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ముందుకూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను ప్రవాసాంధ్రులు అందరు కలిసి చెసుకోవాలని అకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి.ఎం.రమేష్, గల్లా జయదేవ్, లావు కృష్ణదేవరాయులు, రసమయి బాలకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మందలి బుద్ద ప్రసాద్, ఏ.పి.ఎన్నర్టి.ఎస్.అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి గార్లు మాత్లాడుతూ నిర్వాహుకులను అభినందించారు. ఇలాంటి బాషా మరియు సంస్కృతి మిళితమయిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ రూపకర్త శ్రీ విజయ భాస్కర్ గారికి, ప్రధాన పాత్ర పోషించిన జైహో భారతీయం శ్రీనివాస్ రెడ్డికి మరియు జిగ్నాస భార్గవ్కు మరియు పాలుపంచుకొన్న 100 కు పైగా వివిధ దేశాల తెలుగు సంస్థల వారికి తూనుగుంట్ల శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.