అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్తి మరణించాడు. సదర్న్ అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విశ్వశ్వేర రెడ్డి బేతి అనే విద్యార్థి అమెరికాలో ఏప్రిల్ 23వ తేదీన మరణించాడు. గ్రాడ్యుయేషన్ చదవడానికి అతను 2013లో అమెరికా వెళ్లాడు. అతను తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోరాబాద్ గ్రామానికి చెందినవాడు.
ఆ వివరాలను అమెరికా తెలుగు సంఘం (ఆటా) కారదర్శి మధు బొమ్మినేని తెలియజేశారు. విద్యార్థి మృతి గురించి తెలిసిన వెంటనే హౌస్టన్ ఆటా ప్రాంతీయ సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి కంచనకుంట్ల, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ బృందానికి చెందిన రామ్ అన్నాడి, అశోక్ కొండల తమ సంఘం ఇతర సభ్యులకు, అమెరికాలోని అతని బంధువులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని ఇక్కడికి తెప్పించుకుని, అంత్యక్రియలు చేసే ఆర్థిక స్తోమత విశ్వేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులకు లేదు. దీంతో చివరి చూపు కోసం తన కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి పంపించి, అంత్యక్రియలు చేయడానికి సహకరించాల్సిందిగా విశ్వేశ్వర రెడ్డి బంధువు వీరా రెడ్డి కోరారు. సుధాకర్ విజ్ఞప్తిని మన్నించి విశ్వేశ్వర రెడ్డి మృతదేహాన్ని భారత్కు పంపడానికి తగిన సహాయం చేయాల్సిందిగా ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెర్కారీ విజ్ఞప్తి చేశారు. ఆటా సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు అందుకు సహకరించారు.
దాంతో విశ్వేశ్వర రెడ్డి మృతదేహాన్ని హైదరాబాదుకు ఏప్రిల్ 30వ తేదీన పంపించారు. దాంతో విశ్వేశ్వర రెడ్డి మృతదేహం శనివారం తెల్లవారు జామున హైదరాబాదు చేరుకుంది. విశ్వేశ్వర రెడ్డి మృతదేహాన్ని హైదరాబాదుకు పంపించడంలో, కుటుంబ సభ్యులకు తగిన సహాయం అందించడంలో ఆటా కమ్యూనిటీ సర్వీస్ టీమ్కు చెందిన రామ్ అన్నాడీ, అశోక్ కొండల, ప్రాంతీయ సమన్వయకర్త శ్రీధర్ కంచకుంట్ల, ఆటా అడ్వైయిజరీ కమిటీ చైర్, సభ్యులు హనుమంత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పిన్నపురెడ్డి, సంధ్య గవ్వా, అధ్యక్షుడు సుధాకర్ పెర్కారీ, గత అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, ప్రసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ అసిరెడ్డి, కార్యదర్శి మధు బొమ్మినేని, కోశాధికారి కళ్యాణ్ ఆనందుల, ట్రస్టీలు పరమేష్ భీంరెడ్డి, ఆజయ్ రెడ్డి ఏలేటి, అరవింద్ రెడ్డి ముప్పిడి, ఆటా ట్రస్ట్ ఫండ్ చైర్ భువనేష్ బూజాలా, తదితరులు విశేష కృషి చేశారు.