అమెరికాలో వరంగల్ విద్యార్థి హత్య, రెస్టారెంటులో దుండగుడి కాల్పులు
మిస్సోరి: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో భారత విద్యార్థి బలి అయ్యాడు. కాన్సాస్లోని ఓ రెస్టారెంటులో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి శరత్ పైన కాల్పులు జరిపారు. అతనిని కాల్చి చంపిన అనుమానితుడి ఫుటేజీని విడుదల చేశారు. హంతకుడి కోసం కాన్సాస్ పోలీసులు వేటను ప్రారంభించారు.
శరత్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూచిభోట్లను చంపిన ప్రదేశానికి 26 మైళ్ల దూరంలోనే శరత్ హత్య జరిగింది. శరత్ హైదరాబాదులోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ చేశాడు. శరత్ హత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. 30 డాలర్ల బిల్లును కట్టమని అడగడంతో దుండగుడు కాల్పులు జరిపాడని తెలుస్తోంది.
శరత్ ఆరు నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికాకు
కన్సాస్ నగరంలో ఓ రెస్టారెంటులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. దుండగుడు అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల శరత్ కొప్పు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శరత్ ఆరు నెలల క్రితం మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు.
శరత్ చనిపోయినట్లు సమాచారం
శుక్రవారం రాత్రి ఏడు గంటలకు.. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం పది గంటలకు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. శరత్పై కాల్పులు జరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని అతడి స్నేహితుడు ఒకరు బంధువులకు తెలిపాడు. శరత్ చనిపోయినట్లు శనివారం రాత్రి తెలంగాణ పోలీసులు తెలిపారని శరత్ బాబాయ్ ప్రసాద్ వెల్లడించారు.
ఓ రెస్టారెంటులో ఉద్యోగం
వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన శరత్ తండ్రి రామ్మోహన్. హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్నారు. రామ్మోహన్ కుటుంబంతో హైదరాబాద్ అమీర్పేటలోని ధరంకరం రోడ్డులో ఉంటోంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శరత్ హైదరాబాద్లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్ నగరం ప్రాస్పెక్ట్స్ అవెన్యూలోని ఓ రెస్టారెంటులో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తోంది. అక్కడే కాల్పులు జరిగాయి.
బిల్లు అఢిగాడని కాల్పులు
బిల్లు అడిగాడనే కాల్పులు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దుండగుడు రెస్టారెంటులో తిన్నాడు. 30 డాలర్ల బిల్లు అయిందని చెప్పగా శరత్ను కాల్చి చంపేశాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమ కుమారుడిపై కాల్పులు జరిగిన విషయం తెలిసి శరత్ తల్లిదండ్రులు సమాచారం కోసం తెలంగాణ డీజీపీని కలిశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు శరత్ మృతిని నిర్ధారించి తెలంగాణ పోలీసులకు చెప్పారు. వారు శరత్ బంధువులకు చెప్పారు.