మరో ప్రపంచ స్వాప్నికుడు
''ముంజేతిని ఖండించిన/ నా పిడికిట కత్తి వదల పోరాటం నా డైరెక్షన్/ పాట నాకు ఆక్సిజన్''- అన్న చెరబండరాజు లాగా మేర మల్లేశం పోరాటాన్ని రగిలించడం కోసం పాటను ఆక్సిజన్గా ఉపయోగించుకున్నాడు. ఆయన మరో ప్రపంచం కోసం కలలు గన్న స్వాప్నికుడు.
తెలంగాణా విముక్తి పోరాటంలో భూస్వామ్య నైజాం వ్యతిరేక పోరాటం, ఆ తర్వాత దోపిడీ పీడనలేని సమాజం కోసం తపన ఆయన సామాజిక చింతనను తెలియజేస్తుంది. 1946-51ల మధ్య సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో అనేకమార్లు జైలు కెళ్లారు. చిత్రహింసలకు గురయ్యారు. తెలంగాణా ఇండియన్ యూనియన్లో విలీనం అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పని చేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విడిపోయాక జిల్లాలో అమృత్లాల్ శుక్లా, మేర మల్లేశం, జాప లక్ష్మారెడ్డిలు సిపిఐ నుంచి వేరయ్యారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆహ్వానించారు. 1980 తర్వాత 1990 వరకు నక్సలైట్ ఉద్యమం పట్ల ఆశావాదంలో ఉన్నారు.
మల్లేశంగారి ఇంటి పేరు గూడూరి, పీడిత దర్జీ కులంలో పుట్టినందున మేర మల్లేశంగా ఖ్యాతికెక్కారు. ఆనాటి పోరాటంలో ఆయన అరెస్టు అయినప్పుడు కూడా నీ పేరేంటని అగ్రవర్ణ స్వభావం గల రజాకార్ పోలీసు అధికారులు అడిగితే 'మల్లేశం'అని చెప్పగా, 'మల్లేశం ఏంది? మల్లయ్య' అను అని మల్లయ్యగా నమోదు చేశారు. ఈనాడు ఆయనకు ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల తామ్రపత్రంలో మల్లయ్య అనే ఉంది మల్లేశం పుట్టింది వరంగల్ జిల్లా ఎర్రగోల్ల పహాడ్. వీర తాత అక్కన్నపేట వచ్చారు. మల్లేశం తాత నర్సయ్యకు అక్కన్నపేట భూస్వామి చొక్కారావు గౌడి దున్నపోతు పొడవగా చనిపోయాడు. దీంతో మల్లేశం తండ్రి వెంకయ్య చొక్కారావుతో తగాదాపడి తనను కూడా చంపిస్తారనే భయంతో షోలాపూర్, పూనా వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. మల్లేశం హైదరాబాద్కు బతుకుతెరువు కోసం వెళ్లగా అక్కడే ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభలతో పరిచయం ఏర్పడింది. అక్కడ ఒక సర్కస్ కంపెనీలో పనిచేశారు. అప్పటికే బుర్రకథలు చెప్పడం, వాక్చాతుర్యంతో పాటలు పాడడంలో ప్రవేశం ఉన్నందున ఆంధ్రమహాసభ కార్యకర్తలైన పండిత నరేందర్, జగన్, రామ్మూర్తిలతో కలిసి పనిచేశారు. ఆంధ్ర మహాసభ ఉనంచి తిరిగి వచ్చారు.
కరీంనగర్ జిల్లాలోని మల్లారంలో ఎల్మ లస్మయ్య చనిపోయాడు. ముత్తి లింగంకు ప్రజల్లో శిక్ష వేశారు. ఇక్కడి నుంచి మల్లేశంను పార్టీ నాయకత్వం వరంగల్ జిల్లా జనగామ పాత తాలూకాకు పంపించింది. చీటకోడూరు కేంద్రంగా నరహరి, కొత్త ముకుందరెడ్డి, జనార్దన్రెడ్డిలతో దళంగా తయారై గ్రామ గ్రామాన పోరాటాలు కొనసాగించారు. చీటకోడూరు, మార్గెడి, ఎర్రగొల్ల పహాడ్, హన్మంతాపూర్, తుకారం తండ, అడివి కేశ్వాపూర్, కన్నెబోయిన గూడెంలలో భూస్వాముల వద్ద ఉన్న తుపాకులు గుంజుకొని ఈ దళం సంచలనం సృష్టించింది. దీంతో ఇతన్ని పట్టుకునేందుకు నిజాం పోలీస్ దఫేవార్, మోత్నం ప్రయత్నిస్తున్నారు. వడ్లకొండకు చెందిన భూస్వామి లింగారెడ్డికి శిక్షగా ఆయన ముక్కు కోసిన చర్య జనగామ తాలూకాలో ఆ రోజుల్లో సంచలనం అయింది. ఆ తర్వాత 1947లో వెల్దండిలో మల్లేశంను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. దప్పిక అంటే మూత్రం పోయడం నుంచి వేళ్లలో సూదులు గుచ్చడం, విపరీతంగా కొట్టడం జరిగింది. మద్దూరు, సలాకపురం, చేర్యాల, ఇటికాలపల్లి, ముస్త్యాల, బచ్చన్నపేట, కేశిరెడ్డిపల్లి, ఎంకిర్యాల, గానుగపహాడ్ గ్రామాలన్నీ తిప్పుకుంటూ కొట్టారు. జనగామ నిజాం సాహెబ్ అదాలత్ తీర్పు మేరకు 3 సంవత్సరాల 1 నెల జైలు శిక్ష పడింది. ఔరంగాబాద్, బాల్దా (హైదరాబాద్ చంచల్గూడ), జాల్నా కాన్సంట్రేషన్ క్యాంపు, బీడ్ జైళ్లలో ఆయన్ను నిర్బంధించారు. 1951లో విడుదల చేసి నజర్ బంద్ చేశారు.
మల్లేశం రాసిన అన్ని పాటలు సేకరించే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కువగా రాతప్రతులు లేవు. అక్కడక్కడా జనం నోళ్లలోనే ఉన్నాయి. అన్ని పాటలను జ్ఞాపకంతో చెప్పేందుకు మల్లేశంగారి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదు. ఇది కాకుండా ఆయన రాసుకున్న 'ఆత్మకథ' రిపోర్ట్ కూడా ఉంది. దాన్ని ముద్రించాల్సి వుంది.