సొంతలాభం కొంత మానుకుని....
''విదేశాల్లో తెలుగు సంస్కృతీ సాహిత్యాల గురించి తెలిపే వెబ్సైట్స్, పుస్తకాలు, క్యాసెట్లు, సీడీలను అందుబాటులోకి తీసుకురావడం వెనక రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిది, ఇతర దేశాల్లో పుట్టి పెరిగే తెలుగు సంతతి పిల్లలకు మన సంస్కృతి గురించి తెలియ చెప్పడం. రెండోది ఆయా దేశాల ప్రజలకు తెలుగు ప్రజల గురించిన వివరాలు అందించడం'' అని వివరించారు మదన్. ''పిల్లలకు కథల పుస్తకాలు లేవన్న బాధ అందరిలోనూ కనిపిస్తోంది. అలాగే మంచి నిఘంటువులు కూడా లేవు. పంజాబీలు, గుజరాతీలు, తమిళులు, ఉర్దూవాళ్ళు అనువాద గ్రంథాలు ప్రచురించుకుంటున్నారు. పెద్ద అక్షరాలతో - అందమైన బొమ్మలతో పిల్లల కోసం పుస్తకాలు వేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. తొలిదశలో భారతదేశంలో దొరికే పుస్తకాలయినా తీసుకొచ్చి పెట్టాలని నా ఉద్దేశం'' అన్నారాయన.
''ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవాళ్ళకి క్షణం తీరికలేని జీవిత విధానమని నాకు తెలుసు. ఆ కారణంగానే ఒకళ్ళను ఒకళ్ళు కలిసేది కూడా చాలా తక్కువ. అయితే ఆంధ్రుడయిన ప్రతి ఒక్కడూ గర్వపడదగిన విషయాలు అనేకం ఉన్నాయి. అవి అందరికీ తెలియాలి. ఆ లక్ష్యంతో కృషి జరగవలసిందే'' అన్నారు మదన్. ''ఇది ఒక్కరోజులోనో - వారంలోనో - నెలలోనో సాధ్యమయ్యే లక్ష్యం కాదు. ఏళ్ల తరబడి కృషి చెయ్యాల్సి ఉంది. ఎందరో ఉద్దండులు ఈ రంగంలో గొప్ప కృషి చేశారు. చేస్తూనే ఉన్నారు. వాళ్ల కృషితో పోలిస్తే నా ప్రయత్నం చాలా చాలా చిన్నది' అన్నారాయన వినయం ఉట్టిపడుతుండగా. ఖరగ్పూర్ ఐఐటిలో ఎంటెక్చేసిన మదన్మోహన్కి బహుశా విద్యార్థిదశలోనే ప్రవాసాంధ్ర జీవితం తీరు తెన్నులు బాగా బోధపడి ఉంటాయి. అటు తర్వాత కొన్నేళ్లు యూరప్లోనూ, ప్రస్తుతం అమెరికాలోనూ ఉంటుండగా అవే అభిప్రాయాలు మరింత స్పష్టంగా ఏర్పడ్డాయని అంటున్నారాయన. ''మొత్తంమీద మనవాళ్లకి ఆత్మస్పృహ కాస్త తక్కువే అనిపిస్తుంది. ఈమధ్యే జరిగిన ఓ సంఘటన మనవి చేస్తాను. హైదరాబాద్లోని నిస్సాన్ కంపెనీలో పని చేసే ఒక జపనీయ మిత్రుణ్ణి ఇటీవల అతని నివాసం దగ్గరే కలిశాం. అతని గదిలో ఒక నల్లబల్ల ఉంది. దానిమీద జపనీయ భాషలో ఏదో రాసి ఉంది. అదేమిటని అడిగాం. తెల్లారిలేచిన దగ్గిర్నుంచీ చెయ్యదల్చుకున్న పనుల కార్యక్రమ పట్టిక అది. హాయిగా మాతృభాషలో రాసుకున్నాడు. మనలో ఎంతమందిమి అలా చేస్తున్నామో ఒక్కసారి ప్రశ్నించుకోవలసి ఉంది! అతనితోటే జరిగిన మరో అనుభవం మనవి చేస్తాను. ఫలానా మిత్రుడు - అతను కూడా జపనీయుడే - ఎక్కడున్నాడని మేం అడగ్గానే మా మిత్రుడు చటుక్కున ఒక లావుపాటి పుస్తకం తీసి వెతకడం మొదలెట్టాడు. అందులో మాకు కావలసిన వ్యక్తి చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ చిరునామా తదితర వివరాలన్నీ దొరికాయి. ఇంతకీ ఆ డైరక్టరీ జపనీయ భాషలోనే అచ్చయి ఉండడం గమనార్హం. మన దేశంలో ప్రాంతీయభాషలలో డైరక్టరీలు ఎన్ని అచ్చవుతున్నాయి? ముఖ్యంగా తెలుగులో ఏ టెలిఫోన్ డైరక్టరీయో అచ్చేయడానికి ఏమిటి అభ్యంతరం? ఇంగ్లీష్ రాని అనేక లక్షలమందికి కూడా అది అందుబాటులోకి వస్తుంది కదా- మన భాష విషయంలో మనకింత అశ్రద్ధ, అలసత్వం ఎందుకు?'' - ఇవీ పరిగి మదన్మోహన్ మనందరి ముందూ ఉంచిన ప్రశ్నలు. ''ఇవన్నీ వేరే ఎవరికో వేస్తున్న సవాళ్ళుగా భావించకండి. నాలో రగిలే ఆలోచనలు ఇలా బయటికి తన్నుకొస్తుంటాయంతే'' అని ఆయన వివరించారు.
మదన్మోహన్లో ఆత్మవిమర్శకు సైతం కొదవేమీ లేదు. ''ఇంతవరకూ తెలుగులిపిలో ఈమెయిల్ చేసే భాగ్యం మనకు ప్రాప్తించలేదు. అదేమంత భారీ లక్ష్యమేం కాదు. సమర్ధుడైన ప్రోగ్రామర్ తన తీరిక సమయంలో కొంత దీనికి కేటాయిస్తే సులువుగానే ప్రోగ్రామ్ రూపొందించవచ్చు. ఒకవిధంగా చూస్తే ఇది ఈ తరం - మా తరం - సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ల వైఫల్యమేననిపిస్తుం''దన్నారాయన.
తన కౌటుంబిక పూర్వరంగం గురించి వివరిస్తూ తండ్రి పరిగి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజినియర్గా పని చేసి రిటైరయ్యారని మదన్మోహన్ పేర్కొన్నారు. తన తండ్రి 1964-1970 సంవత్సరాల మధ్య - సంసార సంబంధమైన బాధ్యతలు పెరగకముందు - కవిత్వం రాశారనీ, ఆయన కవితలు అప్పట్లో 'భారతి'లో అచ్చయ్యాయనీ ఆయన చెప్పారు. తమకు ఊహ వచ్చేకొద్దీ తమ తండ్రి ఊహాశక్తి పరిమితమవుతూ వచ్చిందని నవ్వుతూ జోక్ చేశారు. వెబ్సైట్ కార్యకలాపాలకు తన శ్రీమతి మీనా అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి అన్నారాయన. ''మీరు సైట్లో పెడుతున్న పుస్తకాలన్నీ చదివారా అని కొందరు మిత్రులు అడుగుతుంటారు. అది కేవలం అసాధ్యం. పైగా నా సైట్ నా సొంత వినియోగం కోసం కాదు కదా! నాకు దొరికిన, వీలయిన మేరకు రకరకాల పుస్తకాలను వెబ్సైట్లో పెడుతున్నానంతే. ముఖ్యంగా సంఖ్యాపరమైన, గణాంకసంబంధమైన వివరాలను విస్తృత ప్రయోజనార్ధం సైట్లో పెడుతున్నాను'' అని పరిగి మదన్ మోహన్ వివరించారు.
చివరిగా ఒక్క మాట - మదన్గారు తన ఫోటో విషయంలో అంత పట్టు పట్టకుండా ఉంటే మీరంతా ఆయన రూపు రేఖలు కూడా చూసి ఉండేవారు. ప్రాప్తం లేదనుకోవాలి!!