పార్ట్-11
పశ్చిమాన సూర్యుడు ఎర్రగా మండిపోతున్నాడు. అమ్మ పచ్చిగడ్డి మూటను నెత్తి మీద పెట్టుకుంది. 'పోదాం బిడ్డా!' అంది. అమ్మ, ముందు అతను వెనకా.. అమ్మకు ఈ తిప్పలేమిటి అనుకున్నాడు. జ్ఞానం తెలిసీ తెలియనప్పటి నుంచి చూస్తున్నాడు. ఇదే కష్టం. ఇదే యాతన. ఇదే ఆరాటం. ఆమె ఆరాటానికి అంతం ఉన్నట్లు అనిపించలేదు. ఆమె పడ్డ కష్టాలు ఒకటా రెండా... ఒక్కో సంఘటన ఒక్కో కథ. భూమి కోసం, దొడ్డి కోసం, దొడ్లో పశువుల కోసం ఆమె నిరంతరం తపిస్తూ, దహిస్తూ...
ముగ్గురం కొడుకులం.. ఆమె ఒరగబెట్టిందేమిటి? అమ్మ నమ్ముకున్న పొలాన్ని, దొడ్డిని, దొడ్లో పశువులను వదిలేసి.. అలా అలా నగరానికి ఒకరి వెనక ఒకరం... రాంరెడ్డి మనసు బాధతో మూలిగింది. అమ్మ భూమిని కాపాడింది కాబట్టే తాము తెల్లగా ఉన్నామా, మల్రెడ్డి వాళ్ల ఆస్తి అతను పెరిగే సరికి చాలా వరకు ఊడ్చుకుపోయింది. తలో దిక్కు అయ్యారు.
''మన కుంట్ల పొలంలో ఎర్ర జెండాలు పాతిండ్రు'' అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మల్రెడ్డి దానికి నాయకత్వం వహించాడని ఇప్పుడు తెలుస్తోంది. తానేమీ మాట్లాడలేదు ఆ సమయంలో. అతనికి మనసులో ఉన్నది ఉండనే ఉన్నది. తన మనసులో మాట చెప్తే అమ్మ రుద్రురాలవుతుంది. ఆ భూమి కోసం ఆమె ఎంత కష్టపడిందో తనకు తెలుసు.
దక్కితే పేదవాళ్లకే కదా, దక్కనీ.. తామెన్నడూ ఆ భూమి మీద పండిన పంటతో బతికింది లేదు. అహోరాత్రులు దాని మీద పని చేయడమే. చిన్నప్పటి నుంచి రాంరెడ్డికి ఆ భూమి మీద పొర్లాడడమే తెలుసు. కడుపు నిండ తిన్న గుర్తు లేదు. పైగా కరణం, సర్పంచ్ ఏకమై పెట్టిన భూమి తగాదా అనుభవాలు తన అమ్మ గుండెల్లోనే కాదు, తన పసి గుండెల్లోనూ బాగానే నాటుకున్నాయి.
రేపో మాపో మోటకు, నాగలికి పనికి వస్తుందనుకున్న కోల్లాగెను దొంగలు దొడ్డి దాటిస్తే తిరగని ఊరంటూ ఉందా? దొంగలెవరో తెలుసు. అయినా పట్టుకోలేని నిస్సహాయత. కక్షతో, కార్పణ్యంతో, భూమి మీద ఆశతో నాలుగు పాడి బర్రెలను గెదుముకొని వెళ్లి ఎక్కడో దాచేస్తే ఏడ్చిన ఏడ్పులు గొంతు దాటి వచ్చాయా? రాత్రులూ, పగళ్లూ ఒకటే వెతుకులాట. వాటి జాడ తెలిసిన కరణం, సర్పంచ్, వాటిని తోలుకెళ్లినవాళ్లు అమ్మను, తనను చూసి నవ్వుతుంటే అయిన గాయాలు మానాయా? అన్నీ నిన్న మొన్న జరిగినట్టే ఉన్నాయి. ఈ భూమి మీద పొర్లాడేవాడెవడికీ శాంతి లేదు. ఇప్పుడు భూమి తీసుకునేవాడి కష్టాలను చూసి తృప్తి పడాలనే కోరిక తన మనసులో ఏ మూలనో ఉందా? ఇవన్నీ అమ్మకు అర్థమయ్యేవేనా? తనను కన్నది గానీ తన ఆలోచనలను కనలేదు కదా! అయినా అమ్మకు పుట్టిన తాము ముగ్గురం పంచుకుంటే ఒక్కొక్కరికి వచ్చేదెంత? పదెకరాలు కూడా ఉండదు. అయినా భూస్వామి. ఎవరైనా ఉన్నతోద్యోగాల్లో ఉన్నారా, ఎవరూ లేరు. నగరంలో ఉన్నారన్నమాటే గానీ ఏ పూటకా పూట వెతుక్కోవడమే. ఈ వెతుక్కోవడంలో ప్రతి రోజూ నెత్తురోడడమే. మల్రెడ్డి అలా చేరిపోయినందుకు తనకేం బాధనిపించలేదు. అతని బాధలే అటు నడిపించాయని అనుకున్నాడు. అది నేరం కూడా కాదు. కానీ, వాడేమవుతాడో, ఎంత కాలం ఉంటాడో అనేదే అంతుబట్టని విషయం.
ఊళ్లో కూడా ఎక్కువ కాలం ఉండాలనిపించలేదు. అమ్మని ఆ వ్యవసాయమంతా వదిలేయమంటే వదిలేయదు. ఇప్పుడు గడ్డిమోపులు, ధాన్యం బస్తాలు మోయమని అడుగదు. తాను మోస్తూ ఉంటుంది. చిన్నప్పుడైతే గడ్డి మోపు ఎత్తుకోకపోతే, ధాన్యం ఇంటికి మోయకపోతే ముందు బతిలాడేది, ఆ తర్వాత తిట్టేది, ఆ తర్వాత కొట్టేది. అది భరించలేక రెండు కిలోమీటర్లు మోస్తే నెత్తి గడ్డకట్టుకుపోయేది. పైగా దొరల ఇండ్ల ముందు నుంచి మోసుకుంటూ వెళ్లడం. అదో చిన్నతనం అనిపించేది. తక్కువరకం పని అనిపించేది. అదేం తక్కువ రకం పని కాదని, నామోషి కాదని, గర్వపడే పని అని తెలిశాక అలా మోయాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇదే విచిత్రం..
అలా మల్రెడ్డి జ్ఞాపకాలను, అమ్మ జ్ఞాపకాలను వదిలేసి నగరం చేరుకున్నాడు రాంరెడ్డి. తమ పొలంలో ఎర్రజెండాలు పాతిన విషయం అతనికి జ్ఞప్తి లేదు. మల్రెడ్డి మాత్రం నిరంతరం మనసును తొలుస్తూనే ఉన్నాడు. ఎంత బలంగా, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. ఆ బలంగానీ, ఆ ఆత్మవిశ్వాసం గానీ ఆ రోజు బాయిగడ్డ మీద మాట్లాడుతన్నప్పుడు కనిపించలేదు. ఏదో బెదురు, అమ్మను చూడగానే ఏదో బెరుకు, బెదురు... అయినా బింకంగానే...
ఎందుకో ఆ రోజంతా మనసు బాగలేదు రాంరెడ్డికి. ఎందుకో అర్థం కావడం లేదు. ఏం చేయాలనిపించలేదు. దానికి కారణాలు వెతికే ప్రయత్నం చేశాడు. రేవతీదేవి కవిత్వంలోనే అతనికి ఏదో సమాధానం దొరికినట్లనిపిస్తుంది. అయితే అవి సమాధానాలా, కావు. ఆమె గుండె పగిలి ఏడిస్తే రాలి పడిన ఒక్కో కన్నీటి చుక్క ఒక్కో కవితై రగిలే మంటలు. ఆ మంటల్లో పొర్లాడడమే, గిలగిలా తన్నుకోవడమే జవాబులు. అదే ఊరట.
అలా మంటల్లో గుండె కాలి బూడిదై పోతున్నప్పుడు, అలా ఊరట చెందుతున్నప్పుడు పిడుగులాంటి సమాచారం. తన శరీరంలోని ఒక అంగం కాలిబూడిదై పోయిన యాతన. రంపపు కోత.