నైపాల్ రేపిన తాజా వివాదం
ప్రతి భారతీయుడు ఎంతో గర్వించే, ఎంతో ఉన్నతంగా చెప్పుకునే పురాతన నాగరికతనే భారతీయుల పాలిట అసలైన శాపమా? తాము గర్వంగా చెప్పుకునే నాగరికతే తమను బాధిస్తున్న విషయం భారతీయులు గ్రహించడం లేదా? ప్రపంచంలో ఇంకా మిగిలి వున్న అత్యంత పురాతన నాగరికతల్లో హిందూనాగరికత ఒకటి. ఈ సనాతన నాగరికతపై వివాదాస్పదమైన వ్యాఖ్యలతో సుప్రసిద్ధ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత విఎస్ నైపాల్ మరోసారి దుమారం సృష్టించారు. టోబాగోలో పుట్టిపెరిగి బ్రిటన్ పౌరసత్వాన్ని పుచ్చుకున్న భారత సంతతికి చెందిన నైపాల్ గతంలో కూడా భారతీయతపై, భారతీయ రచయితలపై నోటి దురసు వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించిన విషయం విదితమే. భారతీయ నాగరికత భారతీయులను ఉద్ధరించకపోగా వారు దాని బాధితులుగా మిగిలారని నైపాల్ తాజాగా వెలువరించిన తన వ్యాససంపుటిలో పేర్కొన్నారు. ది రైటర్ అండ్ ది వరల్డ్ పేరుతో వెలువరిస్తున్న నైపాల్ వ్యాస సంకలనాన్ని పంకజ్ మిశ్రా ఎడిట్ చేశారు.
ప్రతిదానికీ విదేశాలవైపు చూడటం, ప్రతి సమస్యకూ విదేశీ అనుభవాల నుంచి పరిష్కారం వెతకడం భారతీయులకు అలవాటైందని ఆయన తన వ్యాసాల్లో విమర్శించారు. చివరకు విదేశీ కితాబు లేనిదే తమ అస్తిత్వాన్ని కూడా అంగీకరించలేని స్థితిలో పడ్డారని ఆయన చురకలు వేశారు. సాధువులు, సంత్లు, మహాత్ములతో సహా భారతీయులంతా ఆమోదం కోసం సరిహద్దుల ఆవలకు చూడటం నిరంతరంగా జరుగుతున్నదని నైపాల్ వ్యాఖ్యానం. పరాధీనమైన జీవనంలో స్థానికమైన అభిప్రాయాలకు విలువేలేదని ఆయన ఈసడిస్తున్నారు. స్వీయ అస్తిత్వాన్ని కూడా భారతీయులు విదేశీ ముద్రలతోనే ధృవీకరించుకుంటారని ఆయన అన్నారు. దిగుమతి చేసుకున్న ఆలోచనలు, భావజాలం దేశీయ సమస్యలను, సంక్షోభాలను పరిష్కరించవనే విషయం గుర్తించాలని ఆయన సలహా ఇచ్చారు. నెహ్రూలా విదేశాల్లో తానో ప్రత్యేకమైన గుర్తింపును పొందాలనే తపన ప్రతి భారతీయునిలోనూ కనిపిస్తుందని సంస్కృతిక పరమైన గందరగోళానికి ఇదో కారణమని నైపాల్ అభిప్రాయం. మొత్తానికి నైపాల్ తాజా సంకలనంపై కూడా భారతీయ మేధావులు పెద్దఎత్తునే విరుచుకుపడే అవకాశం వుంది.