ఈ వ్యాసాలు ఎందుకు?
సిపిఎం తెలంగాణ వ్యతిరేక వైఖరిపై 'కమ్యూనిజమా, కోస్తావాదమా?' పేర తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో 15 మంది రచయితలు రాసిన వ్యాసాలున్నాయి. ఈ పుస్తకానికి సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, జూపాక సుభద్ర, శ్రీధర్ దేశ్ పాండే, కాసుల ప్రతాప రెడ్డి సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి రాసిన సంపాదకులు రాసిని ముందుమాటను ఇస్తున్నాం.
1996లో మూడో సారి రాజుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1969 ఉద్యమం కంటే గుణాత్మకంగా భిన్నమైంది. అప్పటి ఉద్యమంలో మేధావులు, వామపక్షీయులు మమేకం కాలేదు. వాళ్లలో ఎక్కువ మంది సమైక్యవాదం వేపు మొగ్గుచూపినారు. 1956 నాటి పరిస్థితి కూడా అదే. కాని ఇప్పటి ఉద్యమంలో మేధావుల్లో అత్యధికులు, వామపక్షీయుల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పక్క నిలబడ్డారు. 1950 నాటి విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణా మేధావులు, తెలంగాణ వామపక్షీయులు నిజంగానే విశాలాంధ్ర వల్ల లాభం జరుగుతుందని భ్రమపడ్డారు. లేదా ఆంధ్రా మేధావులు, ఆంధ్రా వామపక్షీయులు భ్రమల్లో ముంచినారు. 1969 నాటికి ఆ భ్రమలు కొంతమందిలో తొలగిపోయినా ఆనాటి ఉద్యమాన్ని తెలంగాణకు జరిగిన అన్యాయంలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా చూడలేదు. బూర్జువా ఉద్యమంగా, రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చిన అవకాశవాద ఉద్యమంగా చూసినారు. ఈ రెండు సందర్భాల్లో సమైక్యవాదానికి సైద్ధాంతిక భూమికను అందించింది వీళ్లే.
ఇప్పుడా పరిస్థితి లేదు. ఇవ్వాళ్ల తెలంగాణ వ్యతిరేక సమైక్యాంధ్ర వాదం వేపు ఏ మేధావీ లేడు. నిజమైన వామపక్షీయులెవరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించటం లేదు. పైగా మద్దతుగా నిలబడుతున్నారు. దళిత బహుజన మేధావులు కూడా ఇదే ఆలోచనలతో ఉన్నారు. వీళ్లెవరికీ విశాలాంధ్ర పట్ల సమైక్యాంధ్ర పట్ల భ్రమలు లేవు. వీళ్లెవరూ తెలంగాణా ఉద్యమాన్ని అనుమానంగా చూడటం లేదు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన ఉద్యమంగా కార తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షగా చూస్తున్నారు. రాజకీయ నిరుద్యోగంలోంచి వచ్చిన ఉద్యమంగా కాక తెలంగాణకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాల్లోంచి వివక్షతలోంచి దూసుకొచ్చిన వలస పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంగా చూస్తున్నారు.
ఒక్క సిపిఎంకు చెందిన వామపక్షీయులు మాత్రమే (సిపిఐ తొలుత వ్యతిరేకించినా ప్రజల ఆకాంక్షను గమనించి, గౌరవించి తెలంగాణ అనుకూలతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే) తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ల ఈ వైఖరిని చూసి తెలంగాణ మేధావులు, మిగతా వామపక్షీయులు కలత చెందినారు. వేదనకు గరైనారు. ఆగ్రహించినారు. అప్పుడప్పుడు దూషించినారు కూడా. వీటి ఫలితమే ఈ వ్యాససంపుటి.
ఈ వ్యాసాలు రాసిన రచయితలందరూ ప్రజల పక్షం వహించి రచనలు చేసేవాళ్లే. ఒక నిబద్ధత, చిత్తశుద్ధి కలిగి ఉండి, బాథ్యత తెలిసిన వాళ్లు కాబట్టి, రాతల పర్యవసానం తెలిసినవాళ్లు కాబట్టి, బాధ్యతారహితంగా, ఏదో ఆవేశంతో రాసిన వ్యాసాలు కావు. న్యాయబద్దమైన, ప్రజాస్వామికమైన ఉద్యమానికి సిపిఎం మద్దతు కూడగట్టటానికి రాసినవే తప్ప తమ స్వీయమైన రాజకీయ ప్రయోజనాల కోసం రాసినవి కావు. కక్షతో రాసినవి అంతకన్నా కావు. అక్కడక్కడ ఆగ్రహం వ్యక్తం కావచ్చు. కాని అది బాధతో కూడుకున్న ధర్మాగ్రహమే కాని కసి కాదు.
ఈ వ్యాసాల్లోని గణాంకాలను, విశ్లేషణలను చూస్తే ఒక్కొక్క రచయిత ఎంత శ్రమించాడో, ఎంత బాధ్యతగా భావించాడో అర్థమవుతుంది. ఈ వ్యాసాలు కొంతమంది రచయితలవే అయినా తెలంగాణలోని ఎంతో మంది ఆలోచనల ఆవేదనల ప్రతిబింబాలు.