వీడ్కోలునామా కవిత గురించి...
తన పెద్ద కూతురు పెళ్లి చేసి ఆమెను అత్తింటికి పంపేటప్పుడు కలిగిన దుఖ్కాన్ని కవితా పంక్తుల రూపాన కాగితమ్మీద పరినారు. కన్నీళ్లతో రాసినట్లున్నదా కవిత... అతని బైరెడ్డి కవితలన్నిటిలో ఏదో వొక ఆర్తి వుంటుంది.
కాళోజీ నారాయణరావుగారయితే పంక్తి పంక్తికి ఏడ్చేవారు. వారికీ ఆ అనుభవం లేదు కాని అంతటి రసార్ద్రమైన హృదయం వారిది. కాళోజీ గారికి పంపాల్సిన కవిత నాకు పంపినాడు కృష్ణారెడ్డి. దేనికీ ఏడ్వననుకునే నన్ను కూడ ఏడిపిస్తివి గదయ్యా అని అప్పట్లోనే జాబు రాసినానతనికి. ఆ కవిత చదువుతున్నంత సేపు అమర గాయకుడు సైగల్ పాడిన బాబూల్ మొరా నైహర్ ఛూటోహి జాయె అనే భైరవీ ఠుమ్రీ నా అంతరాంతరాల్లో మోగుతూ వుండింది...
ఈ శకుంతల నా కూతురు కాదు. పెంపుడు కూతురు. బ్రహ్మచారిని, సన్యాసిని. పెంపుడు కూతురును అత్తారింటికి పంపుతూ దుఖ్కాన్ని ఆపుకోలేకపోతున్నాను. కనిపెంచిన గృహస్థుల దుఖ్కం ఇంకెంత వుంటుందో అనుకుంటాడు కణ్వుడు కరుణ రసమైన శ్లోకంలో. (శ్లోకం - కావ్యేషు నాటకం రమ్యం/ తత్రాపి చ శకుంతలా/ తత్రాపి చ చతుర్థాంకహ/ తత్ర శ్లోక చతుష్టయమ్), ఇదిగో, ఇంతగా వుంటుంది అని వీడ్కోలునామా కవిత ద్వారా బైరెడ్డి కృష్ణారెడ్డి చెప్తున్నాడు. ఆ బాధ అనుభవించిన వాళ్లకే తెలుసు... బైరెడ్డి కృష్ణారెడ్డి కరుణరసం ఇష్టమనుకుంటాను...
our sweetest songs are those that tell of sadest thoughts అన్నాడు షెల్లీ.
కృష్ణారెడ్డికి దీర్ష కవితలు రాయడం ఇష్టమనుకుంటాను. ఆంగ్ల కవులు ఎన్నో స్టాంజాలు తగ్గిస్తే ఏమాయె అనుకున్నాను. కానీ ఇది ఏడ్పు. నవ్వులాట కాదు. నప్పును చప్పున ఆపుకోవచ్చు. కన్నీళ్లనట్లా ఆపుకోవటం కష్టం. తుడుచుకున్న కొద్దీ కన్నీళ్లు ఉబికి వస్తాయి.