కథా నిర్మాణంపై రచయితల గోష్టి
కథానిర్మాణంపై, అంటే శిల్పంపై దృష్టి పెట్టాలని కొంత మంది రచయితలు చేసిన సూచన పట్ల జూపాక సుభద్ర అభ్యంతరం చెప్పారు. దానివల్ల కొన్ని సామాజిక వర్గాల రచయితలకు అన్యాయం జరుగుతుందని, రాసినదాన్ని రాసినట్లు స్వీకరించాల్సిందేనని, వస్తువు మారితే ఆ సామాజిక వర్గాల అభివ్యక్తి దెబ్బ తింటుందని అన్నారు. అభివ్యక్తి మారడానికి అవకాశం లేదని, వస్తువు మారదని, పాఠకుడికి ఆసక్తి కలిగించే విధంగా నిర్మాణం ఉండడం అవసరమని డాక్టర్ కాసుల లింగారెడ్డి అన్నారు. జూపాక సుభద్ర వాదనతో స్కైబాబ కూడా ఏకీభవించారు. శిల్పమంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదని, అభివ్యక్తిలో అది ఒక భాగం మాత్రమేనని కొంత మంది అభిప్రాయపడ్డారు. కథ కథలాగా ఉండాల్సిన అవసరం ఉందని పూడూరు రాజిరెడ్డి అన్నారు.
తెలంగాణకు సంబంధించిన కథలతో ఒక సంకలనం తేవాలని, 1956 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. విశాలాంధ్రవాళ్లు తెచ్చిన తెలంగాణ కథా సంకలనానికి, కర్ర ఎల్లారెడ్డి యేటేటా తెస్తున్న కథా సంకలనాలకు భిన్నంగా ఉంటూ, వాటిలో లేని కథలను ఎంపిక చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
అవసరమైతే, దస్కత్ తరఫున ఓ త్రైమాసిక పత్రికను వెలువరించాలని నిర్ణయించుకున్నారు. పత్రిక ఎలా ఉండాలనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. దస్కత్ కార్యవర్గాన్ని విస్తరించుకున్నారు. కన్వీనర్గా పసునూరు రవీందర్, కో కన్వీనర్లుగా మురళీకృష్ణ, కాసుల లింగారెడ్డి ఎన్నికయ్యారు. మిగతా బాధ్యులను కూడా ఎంపిక చేసుకున్నారు. జిల్లా కన్వీనర్లను నియమించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. కథా నిర్మాణంపై సమావేశంలో సీరియస్ చర్చ జరిగింది.