వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయ కవిత్వ చైతన్యం పార్ట్-2

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunkireddy Narayana Reddy
1980 థకంలో సీమ చైతన్య ఉద్యమాలు ప్రారంభమయిన తర్వాత కొత్తతరం కవులు వచ్చినారు. సీమ వాస్తవికతను రచనలుగా మలచడం అధికమైంది. రాయలసీమ చరిత్రలో నూతనాధ్యాయం మొదలయ్యింది. కవులే కాక, కథారచయితలు, మేధావులు, కూడా సీమ వేదనను కవిత్వంలో ఆవిష్కరించారు. రాయలసీమ జీవితమే ఇతివృత్తంగా జూపల్లి ప్రేంచంద్‌ ''ఆవేద'' రఘుబాబు ''సంఘటిత స్పర్శ'' వై.శ్రీరాములు ''జలగండం'' అనే దీర్ఘ కవితలు రాసినారు. ఈ రెండు థాబ్ధాల కాలంలో వచ్చిన కవుల లిస్టు చాలా పెద్దదే. కొంతమందిని పేర్కొంటాను. పులికంటి కృష్ణారెడ్డి, శాంతినారాయణ, ఎస్‌.మునిసుందరం, రాచపాలెం చంథ్రేఖరరెడ్డి, సూర్యసాగర్‌, శ్రీనివాసరెడ్డి, హెచ్చార్కె, దాదాహయత్‌, రాప్తాడు గోపాలకృష్ణ, వి.ఆర్‌.రాసోని, నరాల రామిరెడ్డి,సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, రాధేయ శశిశ్రీ, గుడ్లపల్లి చిదంబరరెడ్డి, మల్లెల నర్సింహ్మామూర్తి, ఎస్‌.జయ, ఏ.ఎన్‌.దస్తగిరి, కెఎం.రాముడు, గోపిని కరుణాకర్‌, నాగప్పగారి సుందర్రాజు, సుంకోజు దేవేంద్రాచారి, నూకా రాంప్రసాదరెడ్డి, జి.వెంకటకృష్ణ, శాంతికుమార్‌, ఎస్‌. రామచంద్ర, రాజారామ్‌, బిక్కికృష్ణ. షమీవుల్లా, నిర్మలారాణి, శశికళ, సాయిప్రసాద్‌ మొ|| వారు.
ఇక ఈ కవులు రాయలసీమ తమ కవిత్వంలో ఎట్లా పట్టుకున్నారో పరిశీలిద్దాం.
ఆదురు చూపుల ఎడారి వాసులకు ఎండమావి
శ్రీభాగ్‌ ఒప్పందం
స్వార్ధం పులుముకొని రంగులు మార్చే
రాజకీయ ఊసరవెల్లులు
అభివృద్ధికి వారసులై
మిమ్ము నిస్సహాయంగా గెంటేసి నపుడు
ఒప్పందాలు నీటిమీద రాతలే
నెత్తురు కార్చేసీమ -నేల పగిలిన సీమ (ఏ.ఎన్‌)
రాయలసీమ అభివృద్ధికి మూలం కావలసిన శ్రీభాగ్‌ ఒప్పందంలో ప్రధానాంశం నదులపై ప్రాజెక్టులు నిర్మించడం. అది జరుగలేదని ఇక్కడ కవి ఆగ్రహిస్తాడు.

నాగరికతలు నీళ్ళలోనే ప్రవహిస్తాయి. చరిత్రను ఏటి అలలే రాస్తాయి నీళ్ళ కారణంగానే, నీటి ప్రాజెక్టుల కారణంగానే కోస్తాంధ్ర 'నాగరిక' ప్రాంతమైనందున అవి లేని కారణంగానే సీమ అనాగరికమైందని ముని సుందరంగారంటున్నారు. గౌతమి, కృష్ణవేణులు సాగరంలో పడి ఆత్మ హత్యంచుకుంటున్నాయి

రాయలసీమ కరువు సీమగా విసిరేసి నదులున్న ధగా సముద్రంలో కలుస్తున్న వైనాన్ని జూపల్లి ప్రేంచంద్‌ కవితాత్మకంగా చెప్పినాడు. నీటి ప్రాజెక్టులు కట్టని పాలకుల నిర్లక్ష్యాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. ఇక్కడి ఊర్లపేర్లన్నింటి చివర సముద్రమే కాని సముద్రమెక్కడా లేదంటాడు మరోకవి.
వానమాట విన్పిస్తే చాలు
చెవులు అలుగుల్ని సవరించుకునే చెరువులవుతున్నాయి. అన్న సన్నపురెడ్డి వెంకట్రాంరెడ్డి, పై కవులూ ఇంకా చాలా మంది కవులు వర్షాధార ప్రాంతమైన సీమకు నీరెంత ముఖ్యమో వాన ఎంత ప్రాణప్రదమో వైశ్రీరాములుఈ నీళ్ళ మీదనే కావ్యం రాశాడు. ఇటు ప్రాజెక్టులు కట్టక, అటు చాలాకాలంగా వానలు పడక సీమ గిలగిల కొట్టుకుంటున్నది. ఈ స్థితిని కవులు హృదయ విదారకంగా చిత్రించినారు.
రాజకీయం నెత్తుటి మడుగు : అందులో దాహం తీర్చుకునే ప్రతిఫలినీ అడుగూ.........
డేగల రాజ్యంలో / కోయిల ఊసెక్కడిది....../ సీమ నిర్మల భూముల్లో / రైతు రాతి వాసన వేస్తాడు....... నాగలి/ ఆకలితో జచ్చిన పాముల్లా పడి వుంటుంది. రాళ్ళవలేనాన్ని జ్వాలకు / అనువాదం నా కవిత్వం..... కరువును కవితాత్మకంగా చెప్పిన మల్లెల నరసింహ్మామూర్తి ''వర్తమాన రాయలసీమ కవుల్లో ప్రముఖుడు.
నా సీమ వర్తమాన చరిత్ర / జీవరసం ఇంకి
పోయిన మట్టి చరిత్ర / నేతల నిర్లక్ష్యపు చూపు
ల్లోంచి జారినపాత్ర. అంటాడు రాధేయ -
కాసంత వానపడదా - అని / తోట్లో కాసుకుని
కూకుండే/ కాసిన పూత రాలిపాయే /వావికండ్లు
మాత్రం కాయలు కాసే'' అంటాడు గుడ్లపల్లి చిదంబరం రెడ్డి.
''ఈ ఎడారిలో మొలిచే ప్రతి ఇసుక రేణువు చేజారి పోతున్న ఒక సంకటి ముద్దకు ఆనవాల్లు'' అంటాడు దాదా హయత్‌.
నాన్నను ఆశపెట్టని బావి
ఇప్పుడు నిన్ను మోసం చేస్తుందా తమ్ముడూ అంటున్నది. ఎస్‌.జయ.

రాయలసీమ మా తల్లి......పది మట్లబావులు కూడా బావురుమంటున్న వెత నీది/ సుగ్గిలో కూడా ఆకలి తీరని అభాగ్యం నీది'' అంటాడు సూర్యసాగర్‌.''రుతువులైన్నైనా మారాళ్ళసీమకు ఒకే రుతువు -కరువు రుతువు / కాలాలెన్నైనా మా బీళ్ళ సీమకు ఒకే కాలం - ఎండాకాలం'' అంటాడు వై. శ్రీరాములు. ''సేద్యం జూదమై పోయింది / మా అమ్మ మెడలోని తాళిబొట్టు పసుపు కొమ్మైంది... మా తాత బస్టాండులో బిచ్చగాడై పోతు'' అంటాడు గోపిని కరుణాకర్‌. ''ఇక్కడ నీళ్లు లేవు / కన్నీళ్ళు లేవు / సిరి సంపదలు లేవు/ చలువ పందిళ్ళు లేవు/ తరాల బండరాళ్ళ వలె/ మొండి బ్రతుకులున్నాయ్‌ - అంటాడు మునిసుందరం.
కడుపులో ఆకలిని డప్పు అంచుతో అణచి పెడుతున్నట్టు
పొట్టకు హత్తుకొని డప్పువాయిస్తున్నాడు'' అంటాడు వి.ఆర్‌.రాసాని.
వురితాడు పేనిన పత్తి / పురుగు మందు తాపిన వుల్లిగడ్డ / బతుకులా బజారు పాలైన/ రేటు పలుకని టమోటా.......వూడలు దిగని వేరు శెనగ/ బోరులో పడ్డ బాల్యంలా వుక్కిరి బిక్కిరి చేసి చంపుతున్నది/ సేద్యం బతుకు సీమ రైతును ఆదుకొని ప్రతి పంటా మృత్యు హస్తం కావటాన్ని బలంగా చెబుతాడు జి.వెంకటకృష్ణ. 1998 నుండి మొదలై వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వాస్తవానికి వ్యక్తీకరణ ఈ పంక్తులు.

ఈ సీమ వస్త్ర కళానైపుణ్యంలో / రూపుదిద్దుకున్న ధర్మవరం పట్టు చీరెలు/ ఆకలి చావులకు ఆలవాలమై అని కరువుకూ చేనేత కార్మికుల చావుకు గల సంబంధాన్ని చెబుతాడు రాధేయ.

ప్రాజెక్టులు కట్టక, వానలు గురువక కరువులో తల్లడమల్లడమైన రైతులు తమ ప్రాణంలో ప్రాణమైన పశువుల్ని, తమకు జీవనాధారమైన పశువుల్ని కబేళాలకు తెగనమ్మిన దృశ్యాన్ని, చనిపోయిన దృశ్యాన్ని ఇక్కడి కవులు కళ్ళకు కట్టినారు.
బతుకు అప్పుల పాలై
కండ్ల బావుల్లో కన్నీరు ఒకతా వుండేది
తల్లి పాలకు నోసుకోని నీకు పాలిచ్చి
నీ ప్రాణాలను నిలబెట్టిన పెద్దావు
బర్రెముకలు బయటపడి
నీ ఫోటో కల్ల జూస్తా పాణిమిడిసిందిరా........
అని తండ్రి గోపినికి రాసిన మాటలు
తడారిన గొంతుతో నేనూ నేల
గడ్డి కోసమని కసాయి వాని వెంట నడిచిన పశువులు. అన్న నూకా రాంప్రసాద్‌ రెడ్డి మాటలు కరువు సీమ మనుషుల్నే కాదు పశువుల్లో ఎట్లా తరిగిందో తరిమిందో చెబుతాయి. కవులు ఈ దృశ్యాల్ని చిత్రించకపోతే లోకాని కెలా తెలుస్తుంది. సీమ అంటే లోకానికి ఒకనాటి రతనాల సీమో, ఇప్పటి బాంబుల సీమో అనేదే తెలిసి వుండేది. అందుకని కవి ఆయా కాలాన్ని రికార్డ్‌ చేసే చరిత్ర కారుడు కూడా.

మాకు / కరువు చావుకన్నా
ఆకలి చావు కన్నా
వరద ఎంతో సుఖమనిపిస్తుంది. అన్న రాచపాలెం కవిత్వంలో చాలా లోతయిన అర్ధముంది. వరద చావు క్షణాల్లో జరిగి పోతుంది. యాతన వుండదు. పైగా సానుభూతిని సంపాదిస్తుంది. మిగిలిన వాల్లకైనా వరద సహాయ నిధులు అందుతాయి. లోకం అయ్యో అంటుంది. కాని కరువు చావు నలిపిన రోగిలా మెల్లమెల్లగా జరుగుతుంది. లోకం దృష్టినీ, సానుభూతినీ, నిధుల్ని ఆకర్షించదు. ఎప్పుడు వరదలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల్నుండి వరద సహాయం ఒక రోజు జీతం వసూలు చేసి వాళ్ళకు పంపిస్తుంది. కాని కరువు సహాయంగా ఎప్పుడన్న చేసిందా? రెండు చావులే కాని సీమ చావులు ఆదరణ పొందని చావులు రాయలసీమ లోని మరొక ముఖ్య సమస్య ఫ్రాక్ష్యనిజం. శతాబ్ధాల కింద ఏర్పడే పాలెగాళ్ళ వ్యవస్థ స్థానంలో ఆధునిక ప్రజాస్వామిక విలువలు రాక పోవడం కూడా దీనికి కారణం. ఈ సమస్య గురించి సీమకవులు సరియైన రీతిలో స్పందించారు.
''ఇక్కడ విత్తనాలు చల్లినా / మొలిచేది కొడవళ్ళు,
గొడ్డళ్ళు / ఇక్కడ / రేపటి బిడ్డ పలికేది బి.ఫర్‌ బుక్కుకాదు బి.ఫర్‌ బాంబ్‌ అన్న రాచపాలెం మాటల్లో పిల్లలు దాగుడుమూతలాడు తుంటాయి నాటు బాంబులు. అని ప్రొ|| శ్రీనివాసరెడ్డి వాక్యాల్లో మా ఫ్రాక్షనిజం పట్ల అసహానం ఆగ్రహం కన్పిస్తుంది.

రాయలసీమ భాషను కథా రచయితలు పట్టుకున్నట్లుగా కవులు పట్టుకోలేదు. కవిత్వంలో అక్కడక్కడ మాత్రమే కన్పిస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం..........
సిన్నోడికి పాలు బడదామంటె
ఆలి చన్నులు వడబారి యాలబడినాయి
అమ్మకడుపుకాడ సెర్మం (బీడు బడిన నేల మాదిరి గుండాది .....వాన కురిసే ...పల్లె తడిస్చె) కాల్వలు పద్దాలు పాడ్తే......పైన గడిమోడమొస్చే ) నా ఆలికి సీరగా సుట్టుదామని కాసుక్కూచునుండా ) వాన వస్తదో రాదో అన్న మహమూద్‌ కవితలోనూ... ధాన్యం తూర్పోయడానికి...... దడాన కానీండ్రా....... తూర్పోసారు. మూటలు నింపారు...... కొట్ట డీ యిల్లు భర్తీ చేశారు...... (అబ్బబ్బ ఒళ్ళంత నొప్పులు ( పై కావువత్తు కుంటుందెమో........) / రెండు పిచ్చల వింత పండుని/ రెండు ఉప్పరాల్ని.......అన్న దస్తగిరి కవిత ల్లోనూ ఇంకా గోపిని వంటి కవుల కవితల్లోనూ సీమ భాషను చూడవచ్చు. కోస్తాంధ్రులు తమ భాషను సంస్కృతిని తక్కువ చూస్తున్నారని 1931 లోనే గమనించిన సీమ వాసులు తమ భాష పట్ల అభిమానం పెంచుకోలెందుకో తెలియదు. సీమలోని దారిద్రానికి, కరువుకు, వివిధ రంగాల వెనుక బాటుకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారంగా వాళ్ళు భావించలేదు. వాళ్ళ అసంతృప్తిని అసహనాన్ని అగ్రహాన్ని రాజకీయాల మీద ప్రదర్శించినారు. ఈ కింది కవితలు ఆ విషయాన్ని తెలుపుతున్నది.

''మమ్ము / పీనుగులను చేసి ఆడుకునే శత్రువులు ఇద్దరే ఇద్దరు(ఒకరు కరువు రక్కసి మరొకరు రాజకీయ వ్యూహం'' రఘుబాబు. ఐదేండ్లకు ఒకసారి ఆవులించే విమోచన సమితి అడ్డపంచకింద అణుబాంబులు భద్రపరిచింది.
- నాగప్ప గారి సుందర్రాజు.
పదవి ఊడిన వాడి నోట సీమ బాదల బోసిపాట నాలోపల నేను పెను వికటహాసమవుతాను - హెచ్చార్కె (హనుమంతరెడ్డి).
అక్కడక్కడ కవులు తిరుగుబాటును ఆశించారు.
ఉదా|| తాను నాటేప్రతి గింజమీద
గిట్టుబాటు ధర ముద్రించక పోతే
ఆధునిక దోపిడి అందమైన ముఖాన్ని
ఖండఖండాలుగా చీల్చేందుకు
నాగలి మొన నూరుతున్న వీరుడు
ఇది సంక్షిప్త రాయలసీమ ప్రాంత చైతన్య కవిత్వము.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ చైతన్య కవిత్వం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో ఉన్న ఈ ప్రాంతానికి కళింగసీమ, కళింగాంధ్ర, ఉత్కళం అనే పేరు కూడా వున్నాయి.

'' ఈ ప్రాంతం ఎటుచూసినా కోస్తా జిల్లాల్లో భాగం కాజాలదనీ, ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన తెలుగుజాతి అనీ ఈ ప్రాంత ప్రభావాన్ని తెలుసుకోవాలంటే కళింగాంధ్రగా అర్ధం చేసుకుంటేనే మంచిదనీ ఉత్తరాన తామ్రలిపి (మిడ్నాపూర్‌) నుండి పశ్చిమాన బస్తర్‌, దక్షిణాన గోదావరి, తూర్పున బంగాళాఖాతం, వరకు విస్తరించిన ఈ ప్రాంతం అతి ప్రాచీన నాగరికత గలదనీ ఆ ప్రాంత మేధావులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఒకప్పటి కళింగాంధ్రలోని తూర్పు గోదావరి, ఒరిస్సా లో కలిసిన కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఉత్తరాంధ్రగా పిలువబడుతున్న ప్రాంతాలలో లేనందున ఈ ప్రాంతాన్ని కళింగాంధ్రగా పిలువడం కంటే ఉత్తరాంధ్రగా పిలువడమే సబబు. ఉత్తరాంధ్ర పై సరిహద్దులకు కొంత అటూ ఇటూ ఎక్కువ కాలం (సుమారు 10 శతాబ్ధం) కళింగ గాంగుల పాలనో క్రీ.శ. 497 నుండి 1434 వరకు, కళింగ గజపతుల పాలనలో క్రీ.శ. 1434 నుండి 1538 వరకు వుంది. మిగతాకాలం, మిగతా తెలుగు ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలతో కలిపి కొంతకాలం ఒరిస్సా భూభాగాలతో కలిసి కొంతకాలం వేరు వేరు రాజుల పాలనలో ఉంది. పైన పేర్కొన్న సరిహద్దుల కారణంగానూ, పైన పేర్కొన్న సుదీర్ఘ పాలనా కాలం కారణంగాను ఈ ప్రాంతం భిన్న సంస్కృతిని, భిన్న మాండలికాన్ని భిన్న చరిత్రను కలిగి వుంది.

తరువాతి కాలంలో కోస్తా జిల్లాలతో పాటు ఈ ప్రాంతం 1768 నుండి బ్రిటీషర్ల ఆధీనంలోకి వచ్చింది. ''బ్రిటీష్‌ ఆధిపత్యంలోకి వెళ్ళి సర్కారు జిల్లాలుగా ఉన్నప్పటికీ బ్రిటీష్‌ సంప్రదాయాలు, సంస్కృతిని అంటించుకోలేదు. కళింగ ప్రజలు తమ సంస్కృతినే కొనసాగిస్తూ వచ్చారు........నేటి వరకూ ఎలాంటి ప్రచారం(ఆ సంస్కృతి) చూపలేక పోయింది''. అని ఆప్రాంత మేధావులు విశ్లేశించారు. దీన్ని బట్టి ఈ ప్రాంతం ప్రాచీన కాలంలోనే కాక ఆధునిక కాలంలో కూడా విభిన్న సంస్కృతిని కలిగి ఉందనేది అర్ధమవుతుంది.

1930 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడేదాకా ఈ ప్రాంతం గంజాం జిల్లాలో భాగంగా ఉండేది. 1930 నుంచి ఉత్తర, దక్షిణవిశాఖలుగా పిలువబడింది. 1946 - 47 లో విశాఖ నుండి శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. తరువాత విజయనగరం జిల్లా ఏర్పడింది. స్థూలంగా ఇది ఉత్తరాంధ్ర చరిత్ర.

ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొన్నా, శ్రీభాగ్‌ ఒడంబడికలో ఈ ప్రాంత వెనుకబాటుతనం ప్రస్తావన లేదనీ, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో ఈ ప్రాంత నాయకుడు గౌతులచ్చన్న సంతకం చేసినా ఈ ప్రాంత వెనుకబాటు గురించి ప్రస్తావించలేదనీ, ఈ రెండు ఒప్పందాలతో మధ్య కోస్తా నాయకులు పథకం ప్రకారంమిగతా వెనుక బడిన ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రను మోసం చేశారని ఈ ప్రాంత మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రాంతంలో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ, జంఝావతి మొ|| 15 నదులున్నా, వర్షపాతం ఎక్కువగానే వున్న, తక్కువ నదులున్న గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చితే ఇక్కడ నీటి పారుదల భూముల శాతం చాలా తక్కువనీ, పరిశ్రమల స్థాపన, వైద్య సదుపాయం, విద్యా సంస్థల స్థాపన, ఉద్యోగాలు మొ|| అన్ని ఇక్కడ తక్కువేననీ ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. (చూ. ఉత్తరాంధ్ర జనవరి 2000 సంచిక)

దీనికంతటికి మధ్య కోస్తా నాయకుల వివక్షే కారణమంటున్నారు.

ఈ రంగాలతో పాటు సాంస్కృతికంగా కూడా ఈ ప్రాంతం వివక్షకు, అవహేళనకు గురైందని వీరిభావన. ''నాగరికులమని విర్రవీగే ఒక ప్రాంత దోపిడి వర్గాలు పాలక వర్గాలు ఈ మాండలికాన్ని, హేళన చేస్తున్నారు. కళింగాంధ్రలో వెలసిన విజయవాడ, గుంటూరు వంటి నామాలతో గల భోజన శాలలు కళింగాంధ్ర ప్రజల ఆహారపు అలవాట్లను, వంటకాలను అగౌరపరుస్తున్నారు. హేళన చేస్తున్నారు.'' అన్న ఈ ప్రాంత విద్యావేత్తల మాటలందుకు నిదర్శనం. ఈ వివక్షను నిరసించడంతో పాటు ''రాజకీయాధికార స్థానం మారవలసి వుందని'' (చూ. ఉత్తరాంధ్ర - డిసెంబర్‌ 1999) వాళ్ళు ప్రకటిస్తున్నారు.

తమకు జరిగే అన్యాయాలను లోకానికి తెలియ జేయడానికి అక్కడి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం కన్వీనర్‌ గా ''ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక''ను, సన్నశెట్టి రాజశేఖర్‌ ఎడిటర్‌గా ''ఉత్తరాంధ్ర'' పత్రికను స్థాపించుకున్నారు.ఈ ప్రాంత చైతన్యం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోలేదు. కానీ కవిత్వంలో వ్యక్తమయిందేమో చూద్దాం. గురజాడ, రావిశాస్త్రి, కారాలు ఈ ప్రాంత భాషకు ఎప్పట్నుంచో మొత్తం తెలుగు ప్రాంతం సమ్మతిని సాధించి పెట్టిన వారసత్వం ఈ ప్రాంతానికున్నది. శ్రీశ్రీ, నారాయణబాబు, పాణిగ్రహి, వెంపటాపు సత్యం ఇచ్చిన హీరోయిక్‌ వారసత్వం ఈ ప్రాంతాని కున్నది. తర్వాత కాలంలో భూషణం, వంగపండు, అప్పల్నాయుడు లుపై వారసత్వం కొనసాగింపుగా ఈ ప్రాంతానికున్నది. ఈ నేపథ్యం నుంచి ఇక్కడి కవిత్వాన్ని పరిశీలిద్దాం.

'శ్రీకాకుళ సాహితి' 'జముకు' అనే సాహితీ బులెటన్స్‌ 1986 లో మొదలు పెట్టి 9 సంచికల్ని వెలువరించింది. ఇందులో ప్రాంతీయ చైతన్యం వ్యక్తం కాలేదు కానీ తమ ప్రాంత రచయితల్ని మాత్రం గుర్తు చేసుకున్నారు. తర్వాత ''ఉత్తరాంధ్ర రచయితలు'' పుస్తకంగా వేశారు. 1991 లో 'శ్రీకాకుళ సాహితి' ఈ వ్యాసకర్త, బి.వి.ఏ. రామారావు నాయుడు మొ|| సంపాదకులుగా ''యానగాలి'' కవితా సంపుటిని వెలువరించింది.ఇందులో ఈ ప్రాంత భాష కొద్దిగా కనిపిస్తుంది తప్ప ప్రాంతీయ చైతన్యం ఏమి కనిపించదు. దీనికి ముందు వెనకాల వచ్చిన ఛాయారాజ్‌ కవిత్వ పుస్తకాల్లో ఇక్కడి ఉద్యమాల చరిత్ర, ఇక్కడి భాష కనబడుతుంది.

1999లో శ్రీకాకుళ సాహితి వేసిన మరొక సంకలనం 'జముకు' ఇందులో ప్రాంతీయ చైతన్యం ప్రస్ఫుటంగానే వ్యక్తమయ్యింది. ఇక ఇంటి వెనక్కి కట్టిన విత్తనాల కట్టు, వేలాడే మధురమైన జ్ఞాపక మాత్రమే'' అన్న గంటాడ గౌరు నాయుడి కవితలో టెర్మినేటర్‌ విత్తనాలలో మొదలైన పల్లె విధ్వంసం వ్యక్తమయింది.

తూర్పున జోగి కొండ / పశ్చిమాన మహేంద్ర తనయ సాగే కె.ఎస్‌.చలం కవితలో తన ప్రాంత పల్లెలను నెమరు వేసుకోవడం కనిపిస్తుంది.

మాబతుకులు పత్తి పూలై పేలిపోవడం చూశావు........ అధిక దిగబడుల భాగోతంలో అన్యాయాన్ని చూడు (బి.వి.ఏ రామారావు నాయుడు)
''కమిలి పోయిన కొబ్బరి పిందెలు/ కాలి పోయిన జీడి పిక్కల సాక్షిగా - ఇక్కడ పొద్దు దిరుగుడు పువ్వుకి కాలం చెల్లింది (నిశితాసి).
తెల్ల - తెల్లవారే (మన పల్లెలు ఏమాయె
ఉత్తరాంధ్రలోను / మన ఊరులు ఏమాయె
అమ్మ తల్లులు / డప్పుల గెంతులు / హరిదాసులు
మద్దిలి వంతలు / తాళం పాటలు / తప్పిడి గుళ్ళు
ఎటూ పోయెనమ్మ / మన జానపదుల కళలూ (వంగపండు) అన్న కవితల్లో ఉత్తరాంధ్ర పల్లెల విధ్వంసం కళ్లకు కట్టినట్లు వ్యక్తమయ్యింది.

'ఉత్తరాంధ్ర' పత్రిక (1999), అధ్యయన వేదిక వచ్చిన తరువాత ప్రాంతీయ చైతన్యం కవిత్వం ఎక్కువగా వచ్చినట్టు కన్పడుతున్నది. వస్తువిస్తృతి పెరిగింది.
నాగావళి నాట్యాలు - వంశధార వయ్యారాలు.........
బహుదానది సిరుల ధార...... ఉద్దానం బంగారం.......
వీరుల గాధలకు - విప్లవమూర్తులకు....
కాణాచి యై - కళింగసీమగా - కమనీయ చరిత గల ........ ఎవరమ్మా? ఈ తల్లి...... ఎదలో విరిసిన మల్లి పైడి సత్యావతి.
ఉత్తరాంధ్ర మాతా / లాంగుల్య సలిల పునీతా
మా జోహర్లివే మాతా - మట్టివాసుదేవం
కళింగువేలారు గజపతులు చూశారు
సిరిపురం దంత, కళింగ పురాలు
రాజధానులు చేసి రాజ్యాలేలినారు (సీరపు మల్లేశ్వరరావు) లాంటి కవితల్లో ఉత్తరాంధ్రాభిమానం కనిపిస్తుంది.

''ఇన్ని జీవనదులుంటే.... ఇబ్బందులు మనకేలా బంగారు బూవులుండీ......... బాధల బతుకులు యేల
ఉడుకు నెత్తురాంధ్ర ఉప్పెనవ్వాల - లాగుల్య
కవితలోనూ...........
ఏరులు - గెడ్డలు సుట్టూ వుండే
నీరులేని బతుకూ / మన కళింగాంధ్ర బతుకూ
అంటూసాగే వంగపండు పాటల్లోనూ ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టుల పట్ల, పాలకుల వివక్ష చిత్రించబడింది.

ఒక పక్క నుండి రాజులారెడ్లూ చౌదర్లూ వచ్చి నన్ను ఆక్రమించేసినారు
ఆక్రమణ అన్డం తప్పట..... అంటూ సాగే రామారావు నాయుడి దీర్ఘ కవితలో మద్యాంధ్ర (కోస్తాంధ్ర) లు ఉత్తరాంధ్రను ఆక్రమించుకున్న వైనం చిత్రించబడింది.

ఉత్తరాంధ్ర ప్రత్యేక సమస్యల్లో అతి వేగంగా వీచే గాలి ఒకటి. దానివల్ల నష్టాలు ఈ కింది నల్లి ధర్మారావు కవితలో వ్యక్తమయ్యాయి.
''మొగిలి రేకుల సొగసు మేసె మత్తెక్కిండు....
కొచ్చిరాకుల ఊసు కొంచెమైనా ఇనక
మా వుసురు తీసింది మాయదారి గాలీ.....
నంగనాచీ గాలీ నాశనాల గాలీ........

ఆర్‌. రామకృష్ణ రాసిన 'గోడిముక్క' అనే దీర్ఘ కవిత ఇక్కడ దళిత జీవితాన్ని బాగా చిత్రించింది. ఇంకా చింతా అప్పల నాయుడు, సిరికి స్వామి నాయుడులు రాసిన ''రెక్కతతపులగోస', పి.ఎస్‌.నాగరాజు వేసిన ''ప్రవహించే ప్రజలు'' ప్రసిద్ధ కథా రచయిత గంటేడ గౌరు నాయుడు రాసిన ''నదిని దానం చేశాక'' మొ|| కవితా సంపుటాలు ఈ ప్రాంత కరువును, వ్యవసాయ విధ్వంసాన్ని, స్ధానిక సంస్మృతుల విధ్వంసాన్ని శక్తి వంతంగా చిత్రించినాయి.

అయితే ఇక్కడ ప్రాంతీయ చైతన్య కవిత్వం ఉద్యమ స్ధాయి నందుకోలేదు.

English summary
An eminent literary critic and poet Dr Sunkireddy Narayana Reddy analyses the regional awareness in Telugu poetry. He explains the regional expressions of Rayalaseema, North Andhra and Telugu poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X