తెలుగు మహాసభలకు విరసం సెగ
ప్రజల భాష, సంస్కృతులకు ప్రాతినిధ్యం లేని ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలని పలువురు రచయితలు, కవులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలకు పోటీగా ప్రత్యామ్నాయ సాహిత్య- సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించాలని వారు అభిప్రాయపడ్డారు. వందలాది మంది తెలంగాణ యువకులు అమరులైనా పట్టించుకోని ప్రభుత్వం నిర్వహించే సభల్లో పాల్గొనడమంటే ద్రోహానికి పాల్పడటమేనని ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఈ సభలను ప్రతిఒక్కరూ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మహా సభల పేరిట రచయితలు, కళాకారులను తమ వైపు తిప్పుకొనేందుకు యత్నిస్తోందని విరసం నేత వరవరరావు విమర్శించారు. సాహిత్య,కళారంగాల్లోకి కార్పోరేట్ శక్తులు ప్రవేశిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బుద్ధిజీవులంతా ప్రజల పక్షాన నిలబడి ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషల్ని, ప్రజా ఉద్యమాల్ని అణచివేసే కుట్ర ఈ మహాసభల వెనక దాగి ఉందని మంజీర రచయితల సంఘం నేత నందిని సిధారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే రగ్గులు, దుప్పట్లకు ఆశపడవద్దని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ కుట్రను ఎండగడుతూ వివిధ సాంస్కృతిక, సాహిత్య సంస్థలు, వ్యక్తులతో ఐక్య సంఘటనను ఏర్పాటు చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 23న జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు, 29న హైదరాబాద్లో ప్రత్యామ్నాయ సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో విరసం కార్యదర్శి వరలక్ష్మి, అరసం కార్యదర్శి కేవీఎల్, అరుణోదయ కార్యదర్శి సంతోష్, సింగిడి కన్వీనర్ గాదె వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.