విభజన ఎఫెక్ట్: ఆంధ్ర సారస్వత పరిషత్ పేరు మార్పు
హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారుస్తూ తీర్మానం ఆమోదించారు. హైదరాబాద్ కేంద్రంగా తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసం కోసం 73 సంవత్సరాలుగా అవిరళ సేవలందిస్తున్న పరిషత్తును తెలంగాణ రాష్ట్రావిర్భావ నేపథ్యంలో ‘తెలంగాణ సారస్వత పరిషత్తు'గా మార్చారు.
గురువారం జరిగిన పరిషత్తు ట్రస్టు, కార్యవర్గం, సర్వసభ్య మండలి సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పరిషత్తు సమావేశానికి పరిషత్ అధ్యక్షుడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.
పరిషత్తు ట్రస్టు కార్యదర్శి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తెలంగాణ సమగ్ర సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా పరిషత్తు తన కార్యక్రమాలను నిర్దేశించుకొని ఆ దిశగా పురోగమిస్తుందని డాక్టర్ సి.నారాయణరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ ప్రజల సముచిత అభిమతాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య చెప్పారు.
దేవులపల్లి రామానుజరావు వంటి దిగ్గజ సాహితీస్రష్టల ఆధ్వర్యంలో నడుస్తూ నేటికీ అవిరళంగా కొనసాగుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషా వికాసానికి ఎనలేని సేవలు చేస్తూ వస్తోంది.