PORTRAITS OF MOTHER: తలలో నాలుక (పిక్చర్స్)
బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి భారతదేశం గర్వించదగిన రచయిత్రి. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. అయితే, ఆమె అవార్డులకు మించిన ప్రజాభిమానాన్ని పొందారు. 90 ఏళ్ల వయస్సులో ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. దేశమంతా ఆమెకు నివాళులు అర్పించింది.
గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన అంశాలపై ఆమె అధ్యయనం చేశారు. ఆమె రచనలు ప్రపంపవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఆమె రచనలు వస్తునిష్టతో అలరారడమే కాకుండా హృదయాన్ని స్పర్శిస్తాయి. ఆమ బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ ప్రాంతాల్లో గిరిజనులను చైతన్యం చేస్తూ వచ్చారు
ఆమె రచనల్లో హజార్ చౌరాషిస్ మా, బ్రెస్ట్ స్టోరీస్, టిన్ కొరిర్ సాథ్, డస్ట్ ఆన్ ద రోడ్ అత్యంత ప్రసద్ధి చెందాయి. ఒక సందర్భంలో ప్రముఖ రచయిత, ఫొటో గ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఆమెను వివిధ రూపాల్లో తన కెమెరాలో బంధించారు. చూడండి...
ఫొటోలు, రైటప్స్: కందుకూరి రమేష్ బాబు
ముగ్గురు మూలపుటమ్మల నిలయం
ముగ్గురు మూలపుటమ్మల నిలయం కోల్ కొత్తా. ఆ ముగ్గురిలో విశ్వాసానికి చిహ్నం కాళికా మాత. సేవకు మారుపేరు మదర్ థెరిసా. అణగారిన వర్గాల జీవితాల్లో మార్పుకోసం కలం పట్టిన ధీర వనిత, రచయితా కార్యకర్తా...నిన్న మనల్ని వీడి వెళ్లిన మహశ్వేతాదేవి ...ఒక సిసలైన మాతృక. అమ్మ.
కాళికా దేవి ఇలా...
కోల్ కొత్తా నగరం కాళికాదేవి ఆలయానికి ప్రసిద్ధి. నాలుక చాచి అరవీర భయంకరంగా అగుపించే ఆ మాత ఆలయపు గర్భగుడిలో ఒక చిన్న రూపంగా ఉన్నప్పటికీ మహోగ్రంగా మన చెడుగును చెండాడుతుంది. మన భక్తివిశ్వాసాలతో పూజలు అందుకుంటుంది. లోపల ఫొటోలు తీయడానికి అనుమతించరు. కానీ, ఆలయం ఇదే.
కోల్ కొత్తా
కోల్ కొత్తా నగరంలోని గోడలపై కూడా ఆ దేవి చిత్రాలు విప్పారిన నేత్రాలతో మనల్ని లోవెలుపలా కనిపెడుతూ మంచికి చెడుకూ మధ్య నీవెటువైపూ అని ప్రశ్నిస్తూనే ఉంటాయి. చిత్రమేమిటంటే దైవం కొలువైన గుడిలోనే కాదు, గుడి బయటా ఆమె చూపులు సారిస్తూ ఉండటం.
సేవా నిలయం....
మిషనరీస్ ఆఫ్ చారిటీస్ పేరుతో మదర్ థెరిసా చేసిన సేవానిరతి కారణంగా కోల్ కొత్తా ఒక సేవా నిలయం అయింది. 54A, A.J.C. Bose Roadలోని ఆమె కార్యాలయం దాతృత్వానికి చిహ్నంగా విలసిల్లింది. కులమత ప్రాంతాలకు అతీతంగా ఆమె సమాధి చెంత తలవాల్చి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి.
మదర్ థెరిసా ఓదార్పు...
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకుండా మన బాద్యత ఏమిటో మనమే నిర్వచించుకుని సేవలో పునీతమైన మదర్ థెరిసా జీవితం ఒక వ్యధార్థ జీవితాలకు ఓదార్పునంందించిన 'ప్రార్థన' అనవచ్చు.
మహాశ్వేతా దేవి ఇలా...
కాళికా మాత నాలుక చాచి భయపెడుతది. కానీ, ఈ మాత...మహాశ్వేతాదేవి మాత్రం తన జీవితాంతం ఆదివాసీలు అణగారినవర్గాలకు తలలో నాలికలా మారి అమ్మ అంటే ఆలంభన, భరోసా అన్న మాటకు మారుపేరుగా నిలిచింది.
కార్యాచరణ కూడా...
రచనలు, క్షేత్రస్థాయిలో కార్యాచరణ రెండూ అమె జీవితాంతం విడవకుండా సాధన చేసి దేశంలో ఎంతో మందకి స్ఫూర్తిదాతగా నిలిచారు.
మహాశ్వేతా దేవి ఇలా అనేది...
మహాశ్వేతాదేవి అనేది, సామాన్యులే నిజమైన చరిత్ర నిర్మాతలని. జానపద విజ్ఞానం నుంచి స్షూర్తిపొంది మనం చేయవలసినంత పని చేయలేదని.
తన ఇల్లు ఒక గ్రంథాలయం.
మహాశ్వేతా దేవి ఇల్లు ఒక గ్రంథాలయంగా విలసిల్లుతుంది. ఆమె నిరంతర అధ్యయనశీలి. నిరంతర తపన ఆమెను నడిపిస్తూ వచ్చింది.
గంభీరమైన ముద్ర
మహాశ్వేతా దేవి గంభీరమైన ముద్ర సాహిత్యంలో చిరస్థాయిగా ఉండిపోతుంది.
సాహిత్య అకాడమీ అవార్డు
ఆమె 1979లో సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1986లో పద్మశ్రీ , 1996లో జ్ఞానపీఠ పురస్రార గ్రహీత. 1997లో రామన్ మెగసెసే పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
ఆమె కుమారుడు..
నబ్రూన్ భట్టాచార్య మహాశ్వేతాదేవి కుమారుడు. ఇతను నటుడు, నాటక కర్తా, నవలా రచయిత.హర్బర్ట్ అన్న నవలకు సాహిత్య అకాడమీ పుర్కారం అందుకున్నారు. 2014లో ఆయన క్యాన్సర్ వ్యాధి కారణంగా తుది శ్వాస విడికి అమ్మకు కడుపుకోతను మిగిల్చారు.
రైటర్ యాక్టివిస్ట్
రైటర్ యాక్టివిస్ట్ గా ఆమె నిలిచిపోయింది. రచన ఆమెకు శ్వాస. కార్యాచరణ అందుకు హేతువు. ఇట్లా క్షేత్రంనుంచి రచనా క్షేత్రంలోకి ఆమె తన అనుభవాన్నే ఇరుసుగా తీసుకుని ఆర్గానిక్ ఇంటలెక్చువల్ గా క్రియెటివ్ రైటర్ గా బతుకును సుసంపన్నం చేసుకున్నారు.
అదంటే చాలా ఇష్టం....
ఇంట్లో పెద్దగా ఎన్ లార్జ్ చేసిన ఈ చిత్రం ఎవరు తీసిందోగానీ అదంటే మహాశ్వేతా దేవికి ఇష్టం.
ఆమె ఇక్కడే రాసుకునేవారు...
ఇల్లు ఒక కార్యాలయంగా ఒక స్టూడియోగా ఉంటుంది. తన ముందు కుర్చీలో ఎవరో ఒకరు ఆశీనులై ముచ్చటిస్తూ ఉంటారు.అక్కడే కూచుని ఆమె రాసుకునేవారు.
రీడింగ్ రూమ్ కూడా అదే..
ఇంట్లో ఉంటే రీడింగ్ రూం కూడా ఇదే.
ఇంట్లో గోడపై...
ఇంట్లోని గోడపై ఉన్న ఒక లామినేటెడ్ చిత్రం, చరిత్ర.
కళ్లద్దాలు అందుకే గానీ...
వయోభారం వల్ల కండ్లద్దాలు, చేతికర్రా తప్పనిసరైంది. కానీ, ఆమె ఉక్కు హృదయం దీనజనుల కోసం రెట్టించిన ఉత్సాహంతో కొట్టుకుంటూనే ఉన్నది. తదిశ్వాస విడిచేదాక...
రచన ప్రాణం
రచన ఆమెకు ప్రాణం. ఏదో ఒకటి రాయకుండా రోజు గడవదని అనేవారు.
నిరంతర కార్యశీలి...
నిరంతర కార్యశీలి అయిన మహాశ్వేతాదేవి మన బాలగోపాల్ మాదిరే నిరంతరం ప్రయాణాల్లో నిమగ్నమయ్యేది. ప్రజల చెంతకు వెళ్లేది. ఏ తేదీన ఎక్కడకు వళ్లాలి అన్నది ముందే నిర్ణయం అయిపోతుంది. అందుకే ఎవరో వచ్చి తమ ఊరికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ రోజున కాళీ ఉన్నదీ లేనిదీ క్యాలండర్లో చూసుకుంటూ ఉండగా తీసిన చిత్రం ఇది.