వ్యక్తిత్వ వికాసం కాదు: మరేమిటి?
ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కోకొల్లలుగా వచ్చాయి. ఓ వ్యక్తి ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కి, శిఖరాన్ని అధిరోహించడం ఎలాగో ఆ పుస్తకాలు నేర్పే ప్రయత్నాలు చేశాయి, చేస్తున్నాయి. జీవితంలో శిఖరాలను అధిరోహించడం కాదు, శిఖరాలుగా మారడం గురించి మాట్లాడుతున్నాయి. ఇది జర్నలిస్టు, రచయిత కందకూరి రమేష్ బాబు అభిప్రాయం.
అయితే, మీరు సామాన్యులు కావడం ఎలా? పుస్తక రచన ద్వారా ఆయన ఓ వ్యక్తి సామాన్యూడిగా మారాల్సిన అవసరం ఏముంది, సామాన్యుడిగా ఎలా మారాలి అనే విషయాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు. మనుషులు శిఖరాలుగా కాదు, మైదానాలుగా విస్తరించాలని, అందుకు ప్రతి మనిషీ సామాన్యుడు కావాలని అంటాడు.
సామాన్యూడు అంటే సగటు మనిషి కాదని, సాధారణ మానవుడని ఆయన అర్థం చెప్పాడు. చాలా కాలంగా రమేష్ బాబు సామాన్య శాస్త్రం పేర సమాజంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నవారి గురించి రాసి పుస్తకాలు తెచ్చాడు. పేరును, పదవులను ఆశించకుండా సమాజానికి మేలు చేసేవారి గురించే అతను మాట్లాడాడు. అలా పనిచేసేవారినే ఆయన సామాన్యులుగా పరిగణించి, వారి వ్యక్తిత్వాలు మైదానాల్లా విస్తరిస్తున్నాయని అంటున్నాడు.
ప్రతీ వ్యక్తికీ తనదైన జీవనదృక్పథం ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతతో కూడిన జీవన దృక్పథం అది. అలాంటి కొంత మంది మనుషుల గురించి ఆయన ఈ పుస్తకంలో చర్చించాడు. అలాంటి మనుషులు సమాజానికి ఎలా ఉపయోగపడుతారో చెబుతాడు. సామాన్యుడు అంటే ఏమిటో చెబుతూ, సామాన్యులు ఎలా అవుతారో చెబుతూ, అలాంటి మనుషులు ఎవరో చెబుతూ పుస్తకానికి తనదంటూ ఓ దృక్పథాన్ని కందుకూరి రమేష్ బాబు కల్పించాడు.
రమేష్ బాబు రాసిన మీరు సామాన్యులు కావడం ఎలా అనే పుస్తకం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది, వ్యక్తి వికాసానికి సంబంధించింది. వ్యక్తి వికాసం వల్ల సమాజానికి మేలు జరుగుతుందనేది, సమాజంలోని హిపోక్రసీకి స్వస్తి చెప్పవచ్చుననేది పుస్తకం సారాంశం. ప్రస్తుతం హైదరాబాదులోని బుక్ ఫెయిర్లో ఈ పుస్తకం లభిస్తోంది.
- కె. నిశాంత్