హైదరాబాదులో 14న పొయెట్రీ ఫెస్టివల్
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత కవిత్వానికి దూరమవుతుందనే అభిప్రాయం ఉంది. ఇంటర్నెట్ కారణంగాయువతీయువకులు కవిత్వం వైపు చూడడం లేదనే అభిప్రాయం కూడా గట్టిగానే ఉంది. సోషల్ మీడియా అందుకు కారణమని కూడా భావించే వాళ్లున్నారు. ఆ సోషల్ మీడియానే ఆలంబనగా చేసుకుని తెలుగు కవిత్వం విస్తరిల్లుతున్న వైనం గత మూడు నాలుగేళ్లుగా చూస్తున్నాం.
యువతను కవిత్వంపై తీసుకుని రావడానికి కవి సంగమం కృషి చేస్తోంది. చెల్లాచెదురుగా పడివున్న నాటి తరం, నేటి తరం కవులందరినీ ఒక కవిత్వం అనే గూటికి చేర్చుతోంది. కవిత్వాన్ని బతికించుకోవడానికి, యువ కవుల్ని సృష్టించడానికి వారిలో ఆత్మవిశ్వాశాన్ని నింపడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పొయెట్రీ ఫెస్టివల్-14 పేరిట ఈ నెల 14న కవి సమ్మేళనాన్ని నిర్వహించనుంది.
ఈ వేడుకకు భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు సరోజీ నాయుడు స్వగృహం అయిన గోల్డెన్ త్రిషోల్డ్ వేదిక కానుంది.ఈ ఒక రోజు పొయెట్రీ ఫెస్టివల్లో భాగంగా కవితా దిగ్గజాలతో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ కవులు తమ అనుభవాలను నేటి తరం కవులకు పంచనున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్తో పాటు ప్రముఖ తమిళ కవయిత్రి సల్మ, సతీష్చంద్ర, కె. శివారెడ్డి లాంటి ఎంతో మంది కవులు పాల్గొననున్నారు.
కవులందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫేస్బుక్లో ఖాతాను తెరిచి టెక్నాలజీని కవుల కలయికకు, కవితాభావాల పంచుకోవడానికి వేదికగా మార్చుకుంది. ఇప్పటికే ఈ ఖాతాలో 3వేలకు పైగా కవులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ఉన్న కవులందరూ తమ తమ ఆలోచనలను కవిత్వం రూపంలో పొందుపరిచి పంచుకుంటున్నారు.
ఈ ఫేస్బుక్ పేజీ నేటితరం కవులకు మంచి వేదికగా మారింది. కవిత్వంపై ఆసక్తి ఉన్నా ఎలా రాయాలో... ఏవర్ని సంప్రదించాలో తెలియక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారి ఇబ్బందులను ఈ వేదిక చాలా వరకు తీర్చింది.