వజ్రంలాంటి కవిత్వం 'సగం సగం కలిసి'
హైదరాబాద్: భూగర్భంలోంచి వజ్రంలా పవన్కుమార్ కవిత్వం వెలువడిందని, ఇక వెలుగులు వెదజల్లుతూనే ఉంటుందని సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్ అన్నారు. కోడం పవన్ కుమార్ రాసిన 'సగం సగం కలిసి' కవితా సంకలనాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. పవన్కుమార్ బయటి ప్రపంచానికి తెలియకుండా కవిత్వాన్ని రాశాడని టంకశాల అశోక్ అన్నారు.
ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ పవన్కుమార్ మంచి కవి అని, అన్ని సందర్భాల్లోనూ ఆయన స్పందించాడని అన్నారు. కవిగా విస్తరిస్తూ ప్రతి సందర్భాన్ని కవిత్వీకరించాడని కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ బుద్ధిజీవుల్లో తమను తాము ప్రకటించుకోలేనితనం కనిపిస్తుందని, అందుకే పవన్ కుమార్ లాంటి వారెందరో తమ అనుభవాలను పంచుకోకుండా ఉండిపోతున్నారని అన్నారు. తెలంగాణ నవ నిర్మాణంలో తప్పనిసరిగా ఈ లక్షణాన్ని వదిలించుకోవాలన్నారు. ప్రతిభా పాఠవాలను ఇతరులతో పోటీపెట్టాల్సిందే అన్నారు. అప్పుడే తెలంగాణలో కొత్త సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు.
తెలంగాణ సాధన కార్పొరేట్ శక్తులపై ప్రజాస్వామ్య శక్తులు సాధించిన విజయమని నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితల భాగస్వామ్యం కీలకమైందన్నారు. ఉద్యమాన్ని పాట నడిపించిందని, భావజాల ఐకత్యకు పునాది వేసిందని అన్నారు. పవన్ కుమార్ కవిత్వం అలాంటి వాతావరణంలోంచి వచ్చిందన్నారు. కోల్పోయిన గత వైభవాన్ని నిలబెట్టుకునేందుకు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం జరగాలని అన్నారు.
ప్రముఖ కవి జింబో మాట్లాడుతూ జీవితపు పరుగులో తమలోకి తాము చూసుకోవడం తగ్గిందని, అది మళ్లీ తెలంగాణ ఉద్యమంతోనే మొదలైందని అన్నారు. ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచిన ట్యాంక్బండ్పై కొత్త ప్రతీకలు వెలవాలన్నారు. కవి వెంకటేశ్ మాట్లాడుతూ పవన్కుమార్ గొప్ప స్పందన గల కవి అన్నారు. ప్రముఖ కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ - పవన్కుమార్ సగం కవి, సగం పాత్రికేయుడని, తెలంగాణ ఉద్యమం వెంట ఆయన కవిత్వం నడిచిందని తెలిపారు.