తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా నందిని సిధారెడ్డి: తెలుగు మహాసభలు
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా ప్రముఖ సాహితీవేత్త నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్గా ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని సిధారెడ్డికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రగతిభవన్లో స్వయంగా తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో జూన్ 2 నుంచి 10వరకు తొమ్మిది రోజులపాటు హైదరాబాద్లో ప్రపంచ తెలుగుమహాసభలనునిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఈ మహాసభలను తలపెట్టారు.
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ సారథ్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే వీ రమణాచారి, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమితులైన నందిని సిధారెడ్డి, సీఎం కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, కవి వఝల శివకుమార్, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో చర్చించారు.
కార్యాచరణ ఇలా..
అతిత్వరలో ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన కార్యాచరణ, ప్రణాళిక, విధివిధానాలను రూపొందించాలని సాహిత్య అకాడమీ చైర్మన్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. కేవీ రమణాచారి, అధికారభాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకరరావు, సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు తదితరులు కలిసి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు.
సాహితీ ప్రముఖులను తలుచుకునే విధంగా...
వేల సంవత్సరాల క్రితమే తెలంగాణ, పద్యసాహిత్య సంపదతో కీర్తి గడించిందనే చారిత్రక సత్యాన్ని ఈ మహాసభల ద్వారా చాటి చెప్పనున్నారు. దేశవిదేశాల్లోని తెలంగాణ ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానించాలని భావిస్తున్నారు. అవధానాలు, సాహితీచర్చలు, పద్యకవితా పోటీలు, సాహిత్య విమర్శలను నిర్వస్తారు. పంపన, వేములవాడ భీమకవి, పోతన, పాల్కురికి సోమనాథుడి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావుల వరకు తెలంగాణలోని సాహితీ ప్రముఖులను స్మరించుకునేలా కార్యాచరణ రూపొందిస్తారు.
కెసిఆర్కు సిధారెడ్డి కృతజ్ఞతలు
సిధారెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించిన సిధారెడ్డి.. బందారం, వెల్కటూరు, సిద్దిపేటల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏలో పట్టభద్రులయ్యారు. తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై ఎంఫిల్ చేశారు. ఆధునిక కవిత్వం, వాస్తవికత-అధివాస్తవికతపై పరిశోధనచేసి 1986లో పట్టా పొందారు. మెదక్లో కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. 2012లో పదవీ విరమణ చేశారు.
సిధారెడ్డిది విశేష కృషి
నందిని స్థాపించిన మంజీరా రచయితల సంఘం తెలంగాణలో చాలా పేరు ప్రతిష్ఠలను సంపాదించింది. ప్రాణిహిత కవితా సంకలనంతో ఆయన కవితాయాత్ర ప్రారంభమైంది. ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం సిధారెడ్డిని విశిష్ట పురస్కారంతో సత్కరించింది. నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ అనే పల్లవితో సిధారెడ్డి రాసిన పాట తెలంగాణ ప్రతీ పల్లెలో ప్రతిధ్వనించింది. రాష్ట్ర సాధన ఉద్యమంకోసం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉధృతంగా రాజకీయ పోరాటాలు చేస్తున్న సందర్భంలో కవులను, గాయకులను, పండితులను, తెలంగాణ సారస్వత మూర్తులను, మేధావులను ఉద్యమంలో సమీకరించడంలో సిధారెడ్డి విశేష కృషిచేశారు.