భాషా సరళీకరణకు కసరత్తు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు దినపత్రికలు భాషా వికాసానికి విశేషమైన కృషి చేశాయని వన్ ఇండియా తెలుగు సంపాదకుడు కాసుల ప్రతాప రెడ్డి అన్నారు. శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రసార మాధ్యమాలపై గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలుగు దినపత్రికలు భాష సరళీకరణ, సామాన్యీకరణ, క్లుప్తత కోసం అవిశ్రాంతంగా కృషి చేశాయని అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కొరిడే రమేష్ తెలుగు టీవీ చానెళ్లలో సాహిత్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణలో ప్రసార మాధ్యమాల వికాసాన్ని వివరించారు.
సదస్సును తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్ రెడ్డి తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్నాళ్లు ఉమ్మడి రాష్ట్రంలో విలువలు తలకిందులుగా ఉన్నాయని, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో తలకిందులుగా ఉన్న విలువలను సరి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతీకలు మారాల్సిందే...
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెట్టడంపై వస్తున్న విమర్శలను తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తప్పు పట్టారు.
పెద్ద యెత్తున హాజరు
ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రసార మాధ్యమాలపై ఏర్పాటైన సదస్సుకు విద్యార్థులు, మేధావులు, అధ్యాపకులు పెద్ద యెత్తున హాజరయ్యారు.
పత్స సమర్పకులు..
సదస్సులో పరిశోధనా పత్రాలను సమర్పించడానికి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకులు, ఆచార్యలు సదస్సుకు వచ్చారు.
సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి
జర్నలిస్టులు తప్పకుండా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్ అన్నారు.
విలువలను మార్చేస్తాం..
ఉమ్మడి రాష్ట్రంలో తలకిందులుగా ఉన్న అన్ని విలువలను మార్చేసి నిటారుగా నిలబెట్టడానికి కృషి చేస్తామని నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర రెడ్డి అన్నారు.
సుజాత పత్రికపై..
తెలంగాణలో సుజాత పత్రిక తెలుగు సాహిత్యానికి విశేషమైన సాహిత్య సేవ చేసిందని పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అన్నారు
తెలంగాణ పత్రికలకు భాషా శైలి
తెలంగాణ పత్రికలు ప్రత్యేకమైన భాషా శైలిని రూపొందించుకోవాలని వన్ తెలుగు ఎడిటర్ కాసుల ప్రతాప రెడ్డి సూచించారు.
ముగింపు సదస్సులో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బి. నర్సింగరావు తెలంగాణలో చలన చిత్ర అభివృద్ధికి చేయాల్సిన కృషిని వివరించారు. చలన చిత్ర దర్శకుడు ఎన్. శంకర్ తెలంగాణ చలన చిత్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయవచ్చునో వివరించారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తెలంగాణలో ప్రతీకలను మార్చుకోక తప్పదని చెప్పారు. ప్రముఖ విమర్శకుడు, తెలంగాణ చరిత్ర నిర్మాత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గోల్కొండ పత్రిక ద్వారా సురవరం ప్రతాప రెడ్డి సామాజిక సంస్కరణకు చేసిన కృషిని వివరించారు. ప్రారంభ, ముగింపు సభలకు కళాశాల ప్రిన్సిపాల్ సత్తిరెడ్డి అధ్యక్షత వహించారు.