తెలుగు పరిశోధనలపై వేల్చేరు వివాదం
అమెరికాలో ఉంటున్న ఆచార్య వేల్చేరు నారాయణ రావు మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేవాళ్లం కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాడ్జాయి కాబట్టి తెలుగు ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ తెలుగు సాహిత్యంపై ఆయన ఏదో వ్యాఖ్య చేయడం అది వివాదంగా మారడం పరిపాటి అయింది. ఆయన వివాదం సృష్టించి వెళ్లిపోతారు.
ఈసారి ఆయన పరిశోధన, సిద్ధాంత గ్రంథాలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. నేటి పిహెచ్డి గ్రంథాలన్నీ డొల్లగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెరికాలోని ఎమొరి విశ్వవిద్యాలయ కొప్పాక తెలుగు సాహిత్య పీఠం ఆచార్యునిగా వేల్చేరు నారాయణ రావు పనిచేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రాచీన తెలుగు భాషా సాహిత్యాల అవగాహన, శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్య చేశారు.
పరిశోదనలు, సిద్ధాంత గ్రంథాలు ఎందుకు డొల్లగా ఉంటున్నాయో కూడా ఆయన చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యల్లో పూర్తి సత్యం ఉండకపోవచ్చు గానీ ఆయన అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేని పరిస్థితే తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఉంది. ఓసారి నా వద్దకు ఓ పిహెచ్ విద్యార్థిని వచ్చింది. ఆమె రాసిన చిత్తు ప్రతి చదువుతూ ఇది ఫుట్స్ నోట్స్గా ఇవ్వాలమ్మా అని చెప్పాను. ఆమె ఫుట్ నోట్స్ ఏమిటి సార్ అని అడిగింది.
ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. పిహెచ్డి చేసే విద్యార్థులకు లేదా ఎంఫిల్ చేసే విద్యార్థులకు మెథడాలజీ అనేది ఒకటి ఆచార్యులు నేర్పిస్తారు. మేం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు మాకు విధిగా పాటించాల్సిన కొన్ని విషయాలను మా అచార్యులు నేర్పారు. దాన్ని గుర్తు చేస్తూ ఆ మా చెప్తే చెప్పలేదు సార్ అంది. ఆమె నిజమే చెప్పిందో, అబద్ధమే చెప్పిందో తెలియదు గానీ చాలా పరిశోధన గ్రంథాలు నాసిరకంగా ఉంటున్నాయి.
అడిగితే పిల్లలు నేర్చుకోవడం లేదని అధ్యాపకులు, వారు చెప్పడం లేదని పిల్లలూ అంటున్నారు. నేర్చుకోవడం, నేర్పడం అనే దానిలో ఏదో లోపం ఉందనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, చాలా సాహిత్య విమర్శ, పరిశోధన, సాహిత్య సృష్టి విశ్వవిద్యాలయాల వెలుపల జరుగుతోంది. వాటి వెలుపల జరిగే సాహిత్య సృష్టిని అంగీకరించడానికి, తమ పిల్లలకు పరిచయం చేయడానికి ఆచార్యులు ఇష్టపడడం లేదు.
పరిశోధనా ప్రమాణాలు దిగజారుతున్నాయనేది ఎప్పటికప్పుడు వినిపించే మాటే గానీ, ఇప్పుడైత మరింత దరిద్రంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఇతరులు రాసిన వ్యాసాలను కనీసం ఫలానావాళ్లు రాశారు, ఫలానా పుస్తకంలో ఉందనే విషయం చెప్పకుండా మక్కీమక్కీగా తమ తమ పరిశోధనా గ్రంథాల్లో తామే కర్తలమన్నట్లుగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పిహెచ్డి గ్రంథం అంటే దాన్ని అచ్చువేసుకుని లోకానికి చాటాలని నిజమైన సాహిత్య పరిశోధకులకు ఉంటుంది. కానీ, అలాంటి జిజ్ఞాస లేనివారు చాలా మంది ఉన్నత పదవులు పొందడానికి పిహెచ్డి ఒక్కటి అదనపు డిగ్రీ కాబట్టి అయిపోయిందనిపించే బాపతు చాలానే ఉంది.
విద్యార్థులు రాసిన విషయాలు ఇప్పటికే ఎవరు చెప్పారో, ఎక్కడ చెప్పారో తెలుసుకునే ఒపిక పర్యవేక్షకులకు ఉండడం లేదు. కొంత మందికైతే అది తెలిసే అవకాశం కూడా ఉండడం లేదు. మొత్తంగా పరిశోధక పర్యవేక్షకులు కూడా తమ చుట్టు తాము తిరగడం తప్ప బయట ఏం జరుగుతోంది, ఏ సాహిత్యం వస్తోంది, అది ఏ మేరకు ఉత్తమైంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. బయటి సాహిత్య ప్రపంచమంతా నూతన పోకడలతో, వినూత్నమైన అభివ్యక్తితో, నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంటే వారు మాత్రం బొంగరంలా ఉన్నచోటే గిర్రున తిరుగుతున్నారు.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో మంచి పిహెచ్డి గ్రంథాలు రావడం లేదా అంటే వస్తున్నాయి. కానీ అధిక శాతం అత్యల్ప శాతాన్ని అభావం చేస్తుంది. అందువల్ల మంచి గ్రంథాలు, హిహెచ్డి గ్రంథాలను గుర్తించడం కూడా కష్టమే అవుతుంది. వాటి గురించి విశ్వవిద్యాలయాల్లోని వాళ్లు కూడా పెద్దగా మాట్లాడరు.
- కాసుల ప్రతాప రెడ్డి