రిటైర్మెంట్పై మౌనం వీడిన రోహిత్ శర్మ
Rohit Sharma: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3-0 తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ వార్ వన్సైడ్ అయింది.
ఇక వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ఆరంభం కాబోతోంది. శుక్రవారమే తొలి వన్డే. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. 4, 7 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్లు కూడా షెడ్యూల్ అయ్యాయి. ఈ రెండూ కూడా ఈ స్టేడియమే వేదిక.

సిరీస్ ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో ప్రేమదాస స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు రోహిత్ శర్మ. అనేక విషయాలపై స్పందించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ కావడం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో ఉన్న సంబంధాల గురించీ చెప్పుకొచ్చాడు.
టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి అసలు రిటైర్ అయినట్టే లేదని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆ ఫార్మట్ మ్యాచ్లు, సిరీస్ల నుంచి తనకు విశ్రాంతి ఇచ్చినట్టుగా ఉందని పేర్కొన్నాడు. మిగిలిన రెండు ఫార్మట్లు- వన్డే ఇంటర్నేషనల్స్, టెస్టుల్లో కొనసాగుతోండటం వల్ల..క్రికెట్కు దూరం అయ్యాననే ఫీలింగ్ రావట్లేదని అన్నాడు.
అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం గౌతమ్ గంభీర్కు ఉందని రోహిత్ శర్మ చెప్పాడు. రిటైర్ అయిన తరువాతా క్రికెట్కు ఏనాడూ దూరంగా లేడని, హెడ్ కోచ్గా అపాయింట్ కాకముందు ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల కోసం పని చేశాడని గుర్తు చేశాడు. గంభీర్తో మ్యాచ్లను ఆడిన అనుభవం ఉందని, కోచ్గా తనదైన ముద్ర వేస్తాడని ఆశిస్తోన్నట్లు వివరించాడు.
శ్రీలంకతో తొలి వన్డే ఆడబోయే తుదిజట్టు గురించి మాట్లాడుతూ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవడం అనేది చాలా కష్టమని, ఇద్దరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్యానించాడు. అలాంటి పోటీ జట్టులో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని, అప్పుడే మెరికల్లాంటి ప్లేయర్లు బయటికొస్తారని అన్నాడు.












Click it and Unblock the Notifications