రోహిత్,కోహ్లీ లేని లోటు:టీమిండియాకు కొత్త సవాళ్లు!ఇంగ్లాండ్ టూర్కు జట్టు ఎలా ఉండబోతుంది?
భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజ పేర్లు - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆధునిక క్రికెట్లో టీమిండియాకు రెండు కళ్లుగా మారిన ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి వీడ్కోలు పలికారు. టి20, టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఈ ఇద్దరూ కలిసి టి20, టెస్టుల్లో ఏకంగా 21,950 పరుగులు చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఆరు ఫైనల్స్ ఆడారు.
రోహిత్, కోహ్లీల నిష్క్రమణ క్రికెట్ అభిమానులకు తీపి జ్ఞాపకాలను, కాస్తంత బాధను మిగిల్చింది. వీరిద్దరి సారథ్యంలోనే టీమిండియా ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చింది. 2024 టి20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అంతకుముందు, 2023 వన్డే ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడి ఫైనల్కు చేరినా.. దురదృష్టవశాత్తు కప్ గెలవలేకపోయారు.టి20 ఫార్మాట్ నుంచి విజయంతో వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ, టెస్టుల నుంచి మాత్రం వారి కెరీర్లో అత్యంత తక్కువ ఫామ్లో ఉన్న సమయంలో రిటైర్ అవ్వడం చర్చనీయాంశమైంది.

టీమిండియా ముందు సవాళ్లు
ఇప్పుడు టీమిండియా ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే, ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్. ఇది కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్కు నాంది పలకనుంది. ఇప్పటికే రెండుసార్లు WTC ఫైనల్కు చేరిన టీమిండియా.. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో ఓడి, కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్లో మంచి ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం.
రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ముగ్గురు కీలక ఆటగాళ్లు లేని లోటును టీమిండియా మేనేజ్మెంట్ భర్తీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్లో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. రోహిత్ శర్మ వదిలి వెళ్లిన ఓపెనింగ్ స్లాట్, విరాట్ కోహ్లీ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానం, రవిచంద్రన్ అశ్విన్ లేని ప్రధాన స్పిన్నర్ స్థానం.అయితే,ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆల్-అవుట్ స్పిన్నర్ను ఆడించడం అరుదు కాబట్టి,అశ్విన్ లేని లోటు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.రవీంద్ర జడేజా,వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు బ్యాటింగ్లో కూడా రాణించగల సామర్థ్యం ఉన్నవారు కాబట్టి, ఈ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద కష్టం కాదు.కానీ, రోహిత్, కోహ్లీల స్థానాలు మాత్రం తీర్చలేనివి. వారి స్థానాల్లో ఎవరు వస్తారు? ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం.
ఓపెనింగ్ స్లాట్ ఎవరికి?
చివరిసారిగా 2021/22లో భారత్ ఇంగ్లాండ్లో ఆడినప్పుడు, రోహిత్ శర్మ టెస్ట్ బ్యాటర్గా అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో 57.50 సగటుతో 345 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో మనం చూసిన రోహిత్ కంటే అది భిన్నమైన రోహిత్. కొత్త బంతిని జాగ్రత్తగా ఎదుర్కొని, ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లపై విరుచుకుపడటం రోహిత్ శైలి. అలాంటి నమ్మకాన్ని ఓపెనింగ్లో ఎవరు ఇవ్వగలరు? ఈ పాత్రకు కేఎల్ రాహుల్ సరైన ఆటగాడు కావచ్చు.2021 సిరీస్లో మయాంక్ అగర్వాల్ స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్.. నాలుగు మ్యాచ్ల్లో 315 పరుగులు చేసి రోహిత్కు మంచి భాగస్వామిగా నిలిచాడు.
గత కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ లైనప్లో వివిధ స్థానాల్లో ఆడించారు. అతను ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో, యశస్వి జైస్వాల్ తర్వాత పరుగులు చేయగల ఆత్మవిశ్వాసంతో ఉన్న బ్యాటర్గా రాహుల్ కనిపించాడు. రాబోయే రెండున్నర సంవత్సరాల సైకిల్లో అతన్ని ఒక స్థానంలో స్థిరపరచాల్సిన సమయం ఆసన్నమైంది. బహుశా ఓపెనింగ్ అతని స్థానం కావొచ్చు.

నెం. 4లో ఎవరు ఆడతారు?
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీలా నెం. 4 స్థానంలో ఆత్మవిశ్వాసం నింపగల బ్యాటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో విరాట్ కోహ్లీ బ్యాట్తో అజేయంగా కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత ఉపఖండంలో వికెట్లు బౌలర్లకు అనుకూలంగా ఉండేలా చేయడం ద్వారా కోహ్లీ తన బ్యాటింగ్ సగటును త్యాగం చేశాడని కొందరు వాదిస్తారు. జట్టు విజయం కోసం కోహ్లీ ఎప్పుడూ వ్యక్తిగత ప్రదర్శన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. "రికార్డుల కోసం మేము ఆడటం లేదు... మేము టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే చాలు,నా సగటు తక్కువగా ఉన్నా పర్వాలేదు" అని 2015లో సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత కోహ్లీ అన్నాడు.
విరాట్ కోహ్లీ దూకుడు, ఆత్మవిశ్వాసం, నెం. 4 స్థానంలో తిరిగి రావాలంటే, శుభ్మన్ గిల్ వైపు చూడాలి.అతని క్లాస్,అద్భుతమైన షాట్లు,బంతిని డ్రైవ్ చేసే సామర్థ్యం.. శుభ్మన్ను ఒక ఎలైట్ బ్యాటర్గా నిలబెట్టాయి.శుభ్మన్ 2022లో ఓపెనింగ్ నుంచి నెం. 3 స్థానానికి మారాడు. ఇప్పుడు,ఏదైనా టెస్ట్ జట్టులో అత్యంత ముఖ్యమైన బ్యాటర్ ఆడే నెం.4 స్థానంలో అతను స్థిరపడాల్సిన సమయం వచ్చింది.

శుభ్మన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?
ఒకవేళ శుభ్మన్ను నెం. 4కు పంపిస్తే, టీమ్ నెం. 3 స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడిని కనుగొనాలి. మళ్లీ కేఎల్ రాహుల్ను ఈ స్థానంలో ఆడించకపోవడమే మంచిది, ఎందుకంటే అతన్ని అప్పటికే చాలా స్థానాల్లో మార్చారు.టీమిండియా ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దూకుడుగా ఆడే ఆటగాడు కావాలంటే, సాయి సుదర్శన్ సరైనవాడు. డిఫెన్స్ పటిష్టంగా ఉండేవాడు కావాలంటే, రంజీ ట్రోఫీలో రికార్డు స్థాయిలో రాణించిన కరుణ్ నాయర్ ఉన్నాడు. కఠిన పరిస్థితుల్లో పోరాడగల, నిలకడగా ఆడగల ఆటగాడు కావాలంటే, సర్ఫరాజ్ ఖాన్ను పరీక్షించవచ్చు.
ఇక్కడే రోహిత్ శర్మ గతంలో సరదాగా అన్నట్టుగా 'గార్డెన్ మే ఘూమ్నే వాలే' (గార్డెన్లో తిరిగే) కుర్రాళ్లు కీలక పాత్ర పోషిస్తారు.ఇంగ్లాండ్ సిరీస్లో వారు పెద్ద ఎత్తున రాణించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది భవిష్యత్తుకు ఒక పునాది వేస్తుంది.ఒకవేళ భారత్ ఇంగ్లాండ్లో సిరీస్ గెలిస్తే, కొత్త కోచ్/మేనేజ్మెంట్ కు ఇది ఒక శుభారంభం అవుతుంది.ఇది వారు నిర్మించుకున్న జట్టుగా మారుతుంది.కానీ ఒకవేళ భారత్ ఇంగ్లాండ్లో ఓడిపోతే, మళ్లీ ఆందోళన మొదలవుతుంది.
ఇంగ్లాండ్ టూర్కు టీమిండియా ప్రాబబుల్ స్క్వాడ్:
శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.
ట్రావెలింగ్ రిజర్వ్స్:
అర్ష్దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్.
రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు లేని టీమిండియా కొత్త ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తుందో, కొత్త తరం ఆటగాళ్లు ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇంగ్లాండ్ సిరీస్ దీనికి ఒక మంచి ఆరంభం కానుంది.












Click it and Unblock the Notifications