టెక్కీ స్వాతి హత్య, వీడిన మిస్టరీ: తొలిచూపు ప్రేమ, పిచ్చోడని..
చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ సాఫ్టువేర్ ఇంజినీర్ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్.. తాను ఆమెను ఎందుకు చంపేశానో పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. స్వాతి హత్యకు గల కారణాలను చెప్పాడు.
టెక్కీ స్వాతి హత్య కేసు: ఎవరీ రామ్ కుమార్, ఎలా పట్టుకున్నారు?
స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రామ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతను ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. తిరునల్వేలిలోని తానుండే ఇంటిని పోలీసులు చుట్టుముట్టగానే అతడు కత్తితో గొంతు కోసుకున్నాడని పోలీసులు తెలిపారు.
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక విచారణలో రామ్ కుమార్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. స్వాతి హత్యకు ప్రేమనే కారణమని చెబుతున్నారు. వారం రోజుల తర్వాత నిందితుడు చిక్కాడు.
వీడిన మిస్టరీ.. ప్రేమోన్మాదం
స్వాతి కేసులో మిస్టరీ వీడింది. ఆమెను ఓ ప్రేమోన్మాది చంపాడని తేలింది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు రామ్ కుమార్ (23)ను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదే జిల్లాలోని సెంగొట్టె స్వగృహంలో పట్టుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన అతనిని ఆసుపత్రికి తరలించగా 18 కుట్లు పడ్డాయి. దాంతో పోలీసులు అతడు ఆసుపత్రి నుంచీ డిశ్చార్జి అవగానే చెన్నైకి తీసుకురావాలని నిర్ణయించారు.
వీడిన మిస్టరీ.. ప్రేమోన్మాదం
వంద మంది అనుమానితులను, చూలైమేడులో కొందరు ఇచ్చిన సమాచారం, స్వాతి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడు రామ్ కుమారేనని నిర్దారించుకున్నారు. స్వాతి హత్యకేసులో పోలీసులకు లభించిన వివరాల ప్రకారం నిందితుడు రామ్ కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వెతుక్కుంటూ మూడు నెలల క్రితం స్వస్థలం సెంగొట్టై నుంచీ చెన్నైకి వచ్చాడు.
స్వాతి వెంటపడ్డాడు
చూలైమేడులోని సౌరాష్ట్రనగర్లో స్వాతి ఇంటికి సమీపంలో ఉన్న ఒక మాన్షన్లో గది అద్దెకు తీసుకున్నాడు. అప్పుడే అతడు తొలిసారి స్వాతిని చూశాడు. తొలిచూపులోనే అతడు ఆమె పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. తన ప్రేమను అంగీకరించాలని స్వాతి వెంటపడేవాడని చెబుతున్నారు.
తిరస్కరించిన స్వాతి
ఆమె సున్నితంగా తిరస్కరించేదని, అతడికి ఉద్యోగం ఏదీ లేకపోవడంతోపాటు స్వాతి ఆకర్షణకు లోను కావడంతో ఆమెను నీడలా వెంటాడేవాడంటున్నారు. తనను ప్రేమించాలని లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. అతడి ప్రేమ ప్రతిపాదనను స్వాతి పలుమార్లు సున్నితంగా తిరస్కరించింది. అతను ప్రేమ పిచ్చోడని భావించి తేలిగ్గా తీసుకుంది.
ఎవరికీ దక్కొద్దని..
దాంతో రామ్ కుమార్ ఆమెపైన ద్వేషాన్ని పెంచుకుని తనకు దక్కని ఆమెను ఇంకెవరికీ దక్కకుండా చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అదను చూసి ఆమెను వెంబడించి గత నెల 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఆమెను చంపేసి పారిపోయాడు. వెళుతూ ఆమె సెల్ఫోన్ కూడా తనతో పట్టుకెళ్లాడు.
దర్యాఫ్తు తర్వాతే..
స్వాతి కేసును తాము ఛేదించామని నగర పోలీసు కమిషనర్ రాజేందర్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్వాతి కేసులో నిందితుడు రామ్ కుమార్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. సెంగొట్టెలోని అతడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు అతడు ప్రాణభయంతో ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లి బ్లేడుతో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని, అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారన్నారు.
దర్యాఫ్తు తర్వాతే..
అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో అతడిని డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్యులు అతడిని ఎప్పుడు తీసుకెళ్లవచ్చని చెబితే అప్పుడు నిందితుడిని చెన్నైకి తీసుకొచ్చి విచారిస్తామన్నారు.
దర్యాఫ్తు తర్వాతే..
అతడిని విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తమ ప్రాథమిక సమాచారం ప్రకారం అతడు స్వాతిని ప్రేమించాడని, అయితే అది ఏకపక్ష ప్రేమమాత్రమే అని, అతడి ప్రేమను ఆమెను కాదనడంతో ఉన్మాదిలా మారి ఆమెను హత్య చేశాడని తాము భావిస్తున్నామన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి తమకు ఎందరో సహకరించారని, స్వాతి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సహకరించారన్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన పోలీసులను ఆయన అభినందించారు.