ఒక్క రోజే 10మంది ప్రాణం తీసిన పెద్ద నోటు: ఇంకెంత కాలం?
హైదరాబాద్/అమరావతి: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు కారణంగా ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో బుధవారం మొత్తం 9మంది మరణించారు. నల్లధనం, నకిలీ కరెన్సీ అరికట్టేందుకు ప్రధాని మోడీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 9 నుంచి సామాన్యులకు నోట్ల తిప్పలు తప్పడం లేదు.
తెలంగాణలో ఇద్దరు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు చేసిన అప్పును తీర్చలేక, తన భూమిని అమ్మాలనుకుంటే పెద్ద నోట్ల రద్దుతో ఎవరూ ముందుకు రావడంతో కుటుంబానికి కూరలో విషం కలిపి తినిపించాడు. దీంతో ఆ కుటుంబంలో తండ్రీ, కొడుకులు మృతి చెందగా, మిగితా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు మృతి
పెద్ద నోట్లు మార్చేందుకు బ్యాంకుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు క్యూలైన్లలో నిలబడి కుప్పకూలిపోయారు. చిత్తూరులోని కాజూరుకు చెందిన రత్నపిళ్లై(75) స్థానిక శేషాఫిరాన్వీధిలోని ఇండియన్ బ్యాంకు ప్రధానశాఖకు నోట్లు మార్చుకునేందుకు వెళ్లాడు.
క్యూలైనులో
వేచిఉన్న
ఆయన..
కాసేపు
కూర్చోడానికి
ప్రయతిస్తున్న
సందర్భంలో
కుప్పకూలిపోయాడు.
స్థానిక
ప్రభుత్వాసుపత్రికి
తరలించేటప్పటికే
ఆయన
మృతి
చెందినట్లు
వైద్యులు
ధ్రువీకరించారు.
మరోవైపు కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలేనికి చెందిన కనకమేడల విజయలక్ష్మి(70) నోట్లు మార్చుకునేందుకు కాటూరు రోడ్డులోని ఎస్బీఐ శాఖకు వచ్చారు. కొద్దిసేపటికే అక్కడున్న బంధువులను పిలుస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు విజయలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు.
చిరువ్యాపారి మృతి
పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల తన కూరగాయల వ్యాపారం దెబ్బతినిందనే మానసిక వేదనతో చిరువ్యాపారి పోలేపల్లె వెంకటనారాయణశ్రేష్టి మృతి చెందారు. ఈ ఘటన బుధవారం కడప జిల్లా వేంపల్లెలో చోటుచేసుకుంది.
కుమార్తె పెళ్లి రద్దు: గుండెపోటుతో తండ్రి
కుమార్తె పెళ్లికోసం తెచ్చిపెట్టుకున్న డబ్బు చెల్లక.. గంటల తరబడీ క్యూలో నిల్చున్నా మార్చుకోవడం కుదరక దిగులుపడిన ఓ తండ్రి షహత్వర్ నగర్ పంచాయతీలో గుండెపోటుతో మరణించారు. దీంతో, బుధవారం జరగాల్సి ఉన్న పెళ్లి రద్దయింది.
ముందు జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న డబ్బు కాస్తా.. మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పనికి రాకుండా పోయాయని సురేష్ సోనార్(40) ఒక్కసారిగా దిగాలుపడి పోయారు. మంగళవారం ఉదయం నుంచీ గంటల తరబడి క్యూలో నిల్చున్నా చివరకు పనికాలేదు. దీంతో, సాయంకాలం ఇంటికి వచ్చిన ఆయన రాత్రివేళ గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
బరేలీలో మరో వ్యక్తి
బరేలీలని బరాదరి ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖ ముందు డబ్బు ఉపసంహరణకోసం క్యూలో నిల్చున్న ఖలీఫ్ హసన్ అలీ(56) అనే వ్యక్తి స్పృహతప్పి కింద పడిపోయారు. జనం వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించేలోగానే మరణించినట్లు సంబంధిత డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశరాజధాని ప్రాంతంలోనూ
కేంద్రం రద్దుచేసిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు ముందు క్యూలో నిలుచున్న పాతఢిల్లీకి చెందిన 48 ఏళ్ల సౌద్ ఉర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురై.. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. బుధవారం ఉదయాన్నే వచ్చి క్యూలో నిలుచున్న అతడికి 11.45 గంటల సమయంలో ఇబ్బందిగా అనిపించి ఇంటికి ఫోన్చేశారు. బంధువులు వచ్చి అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు.
ముంబై: క్యూలో నిల్చుని కుప్పకూలిన వృద్ధుడు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పాతనోట్లను మార్చుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు క్యూలో నిలుచున్న దిగంబర్ మరిబా కస్బే అనే 70 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించారు. అతడి మృతదేహానికి విష్ణుపురి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
పుణె: బ్యాంకు ఉద్యోగి మృతి
విధినిర్వహణలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి ఆఫీసులోనే కుప్పకూలిపోయి మృతి చెందిన సంఘటన ఇక్కడికి సమీపంలోని రాజ్గురునగర్లో బుధవారం చోటు చేసుకుంది. తుకారాం తన్పూరే అనే వ్యక్తి ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మెసెంజరుగా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కుర్చీలో కూచుని పనిచూసుకుంటున్న తుకారాం హఠాత్తుగా కిందకు పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేసరికే మరణించారు.
ఇంకెంత కాలం?
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. సామాన్య జనానికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. తెల్లారితో ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది తమ విధులను సైతం వదులుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ఉంటాం కానీ, తమకు ఈ ఇబ్బందులెంటనీ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు ఈ పెద్ద నోట్ల ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సామాన్య జనం కోరుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు సమర్థవంతంగా పని చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.