షాకింగ్: 13మార్గాల్లో నల్లధనాన్ని మార్చేస్తున్నారు!
న్యూఢిల్లీ: దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల(రూ.500, 1000) రద్దుతో సామ్యానులకు ఇబ్బందులు ఎదురవుతుండగా, నల్లకుబేరులు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ వద్ద ఉన్న భారీ మొత్తం నల్లధనాన్ని ఎలా తెల్లధనంగా మార్చుకోవాలని నానా హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లకుబేరులు అడ్డదారుల్లో తమ నల్లధనాన్ని మార్చేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు.
కాగా, కొందరు తక్కువ మొత్తం నల్లధనం ఉన్నవారు తమ వద్ద ఉన్న మొత్తాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ఆర్థిక నిపుణులతో చర్చించి రియల్ ఎస్టేట్, బంగారం, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకులు, బీనామా ఖాతాలు సృష్టిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం 6శాతం మాత్రమే నల్లధనం అక్రమంగా ఉంది. మిగితా నల్లధనం మొత్తాన్ని తమ తమ నివాసాల్లోనే దాచేశారు.
అందుకే నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చుకోవాలని గూగుల్ సెర్చులో వెతుకుతున్నారు. ఇందులో గుజరాతీలే మొదటివారిగా ఉండటం గమనార్హం. ఈ విధంగా సెర్చ్ చేసి తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్న నల్లకుబేరులు ఎక్కువగా ఈ 13మార్గాలనే ఆశ్రయిస్తున్నారు.
1. ఆలయాలకు విరాళాలు
తమ వద్ద పెద్ద మొత్తంలో నల్లధనం ఉన్న అక్రమార్కులు వేరే దారులు దొరక్కపోవడంతో ప్రముఖ ఆలయాలను ఆశ్రయిస్తున్నారు. తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని దేవాలయాల్లోని హుండీలో వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ఆలయ అధికారులు ఈ మొత్తాన్ని బ్యాంకుల వద్ద జమ చేసి కొత్త నోట్లు మార్చుకుంటుంది. డబ్బులు వేసిన వారి వివరాలు తెలియకపోవడంతో చాలా మంది ఇదే మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆలయ హుండీల సొమ్ముపై ఎలాంటి తనిఖీలు ఉండవని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వీరంతా ఆలయాల బాటపడుతున్నారు. కాగా, కొందరు పూజారులు 20శాతం కమీషన్ తీసుకుని నల్లకుబేరులకు భారీ మొత్తాన్ని మార్చి ఇస్తున్నట్లు సమాచారం.
2. కో-ఆపరేటివ్ బ్యాంక్స్, క్రెడిట్ సొసైటీల్లో ముగిసిన తేదీల్తో ఎఫ్డీలు
సహకార బ్యాంకులు, క్రికెడిట్ సొసైటీల్లో ఎక్కువగా పుస్తకాలతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నల్ల కుబేరులు వీటిని ఆశ్రయిస్తున్నారు. రద్దు ప్రకటన ముందు తేదీ వేసి భారీ మొత్తంలో డబ్బులు ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఇతరుల పేర్లు, ఊర్లను కూడా నల్లకుబేరులు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతర నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు కూడా నల్లకుబేరులకు సహకరించి వారి నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుతున్నాయని తెలుస్తోంది. ఇలా అవి మనీలాండరింగ్ కు పాల్పడుతున్నాయి.
3. పేద వారిని ఉపయోగించి..
నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు పేదలను కూడా ఆశ్రయిస్తున్నారు. వారికి కొంత కమీషన్ ఇస్తామని చెప్పి రూ.2.50లక్షలను వారితో బ్యాంకులు జమ చేయిస్తున్నారు. మరికొందరు తమ వద్ద పని చేసే ఉద్యుగులను కూడా ఈ విధంగా వాడుకుంటున్నారు.
4. పేదవారికి అప్పులు ఇవ్వడం
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లకుబేరులు, పలు సంస్థలు పేద వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి. ఇలా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
5. జన్ ధన్ ఖాతాదారుల వెతుకులాట
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేదవారికి బ్యాంకు ఖాతా ఉండాలని ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలను కూడా నల్ల కుబేరులు వదిలిపెట్టడం లేదు. వారి ఖాతాల్లో ఎక్కువ డబ్బు ఉండదు కాబట్టి, అలాంటి ఖాతాలను వెతికి రూ. 50వేల నుంచి రూ. 2.50లక్షల వరకు వారి ఖాతాల్లో జమ చేయిస్తున్నారు. ఇందుకు వారికి కొంత కమీషన్ కూడా ఇస్తున్నారు.
6. బ్యాంక్ నోట్ మాఫియా
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంక్ నోట్ మాఫియా కూడా తయారైంది. 15శాతం నుంచి 80శాతం కమీషన్ వసూలు చేసి రూ. 500, 1000 నోట్లకు చెలామణిలో ఉన్న నోట్లు ఇస్తోంది ఈ మాఫియా.
7. ముందే జీతాలు ఇవ్వడం
రద్దు ప్రకటన నేపథ్యంలో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకునేందుకు పలు సంస్థలు, వ్యక్తులు తమ వద్ద పని చేసే సిబ్బందికి ముందుగానే జీతాలుగా పాత నోట్లను చెల్లిస్తున్నారు. ఏకంగా వచ్చే 3, 8 నెలలకు కూడా ఇప్పుడే జీతాలు చెల్లించడం గమనార్హం. గుజరాత్లో అయితే ఇందుకోసం పలువురికి కొత్త ఖాతాలు కూడా తెరిచినట్లు తెలుస్తోంది. పాత నోట్లను డిసెంబర్ 30వరకు మార్చుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.
8. రైల్వే టికెట్లను బుకింగ్ చేసి రద్దు చేసుకోవడం
నవంబర్ 24 వరకు పాత నోట్లు రైల్వే ప్రయాణాల కోసం చెల్లుబాటు కావడంతో ఎక్కువ సంఖ్యలో టికెట్లను బుక్ చేసి ఆ తర్వాత రద్దు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తగ్గించేసుకుంటున్నారు. అంతేగాక, ఇలా చేయడం వల్ల వారికి చెల్లుబాటయ్యే నోట్లు రిఫండ్ చేయడం జరుతుండటం గమనార్హం. ఇలా ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లను బుక్ చేసుకుని రద్దు చేసుకోవడం ద్వారా కూడా నల్ల కుబేరులు తమ ధనాన్ని తెల్లధనంగా మార్చేసుకుంటున్నారు. ఇందుకు ట్రావెల్ ఏజెంట్స్ కూడా కమీషన్ తీసుకుని తమ వంతు సహకారం అందిస్తున్నారు.
9. మనీలాండరింగ్ సంస్థలు
చార్టర్డ్ అకౌంటెంట్లతో నడిచే చాలా మనీలాండరింగ్ సంస్థలు నల్ల కుబేరులకు అందుబాటులో ఉన్నాయి. కోల్కతా, ముంబైలలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఆదాయపు పన్ను, చట్టంలోని లొసుగులతో ఈ సంస్థలు నల్లకుబేరుల సొమ్మును తెల్లగా మార్చేస్తున్నాయి. ముగిసిన తేదీలతో లావాదేవీలు నిర్వహించినట్లు భారీ మొత్తంలో తెల్లధనంగా మార్చేస్తున్నాయి.
10. బంగారం కొనుగోళ్లు
ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న రాత్రి నోట్ల రద్దు ప్రకటన చేసిన గంటల్లోనే నల్ల కుబేరులు నగల దుకాణాల వద్ద వాలిపోయారు. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి అనేక ఆభరణాలు కొనుగోలు చేశారు. దీంతో బంగారం రేటు కూడా పెరిగిపోయింది. నగల దుకాణాదారుల సహకారంతో నవంబర్ 8 కంటే ముందే నగలను కొనుగోలు చేసినట్లు బిల్లులను తయారుచేయించుకున్నారు నల్లకుబేరులు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నగల వ్యాపారుల నుంచి కార్యకలాపాల నివేదికను కోరింది.
11. రైతులనూ వాడుకున్నారు
వ్యవసాయం ద్వారా సంక్రమించే ఆస్తికి ఆదాయపు పన్ను ఉండదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లకుబేరులు రైతుల ద్వారా తమ ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. కమీషన్ ఇస్తామంటూ బ్యాంకుల్లో జమ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలు పండిన పండకపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ యేడాది డబ్బులు ఎక్కువగానే ఉండే అవకాశముందని పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
12. రాజకీయ పార్టీలను ఉపయోగించి..
రాజకీయ పార్టీలు కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. రూ. 20వేలు లేదా అంతకంటే తక్కువ మొత్తాలను నల్ల కుబేరుల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నాయి. డిసెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్చుకుందామని భావిస్తున్నాయి. దీంతో నల్లకుబేరులు కూడా పార్టీలను ఆశ్రయించి విరాళాలు ఇస్తున్నారు.
13. నర్మగర్భంగా బ్యాంకులను కూడా ఆశ్రయిస్తున్నారు
ఆదాయం కంటే ఎక్కువ(2.50లక్షలకు మించి)గా సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తే 200శాతం టాక్స్ వసూలు చేస్తామని ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేగాక, పెనాల్టీ కూడా వసూలు చేస్తామని తెలిపింది. ఓ వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు జమ చేస్తే.. దానిపై 33శాతం ఆదాయపు పన్ను వసూలు చేస్తామని తెలిపింది. ఈ ఆదాయానికి తగిన ఆధారాలు చూపకపోతే ఆ మొత్తంపై పెనాల్టీ కూడా విధిస్తారు. ఈ నేపథ్యంలో చాలా మంది బ్యాంకులకు వచ్చేందుకు జంకుతుంటే.. అత్యంత స్వల్ప సంఖ్యలో మాత్రేమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు నల్లకుబేరులు.
వీటితోపాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా పలువురు రాజకీయ నాయకులు, నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకుంటున్నారు. వారి వద్ద ఉన్న రూ. 500, 1000నోట్లను ఈ దుకాణాల్లో చేర్చి చెలామణి అయ్యే నోట్లను తీసుకుంటున్నారు.