బాబుకు తమిళనాడు ఝలక్: ఎక్కడిదాకైనా రెడీ.. ఇక జగన్ పక్కా ప్లాన్
అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావం ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన పడే అవకాశాలున్నాయా? అంటే అవుననే అంటున్నారు.
అమరావతి/చెన్నై: అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రభావం ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన పడే అవకాశాలున్నాయా? అంటే అవుననే అంటున్నారు.
ఏపీలో టి హవా.. హైదరాబాద్లో ఇబ్బందిపడుతుంటే తెలంగాణ అధికారా?: బాబుకు షాక్
తమిళ ఎఫెక్ట్.. బాబుకు షాక్, తెరపైకి జగన్ ఈ డిమాండ్
తమిళనాడులో స్పీకర్ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ ధిక్కరణ అంశంపై అనర్హత చట్టం కిందే తమిళనాడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధానం తమ పార్టీకి చెందిన 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అమలు చేయాలనే డిమాండును వైసిపి తెరపైకి తేనుంది.
వైసిపిలో కొత్త ఉత్సాహం
2014లో వైసిపి నుంచి గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తోంది. ఇప్పుడు తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో వైసిపికి మరింత ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి షాక్. ఓ విధంగా నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత వైసిపిలో ఉన్న నిరుత్సాహాన్ని తమిళనాడు ఎఫెక్ట్ మరిచేలా చేసిందంటున్నారు.
కోడెలపై ఒత్తిడి, ఆ వ్యూహానికి మరింత పదును
దేశవ్యాప్తంగా శాసనసభలకు సంబంధించి స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు చట్టం ప్రకారమే కొనసాగుతున్నందున, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫిరాయింపులపై స్పీకర్ కోడెల శివప్రసాద్.. తమిళనాడు స్పీకర్ ధనపాల్ను ఆదర్శంగా తీసుకోవాలనే డిమాండును వైసిపి తెరపైకి తీసుకు రానుంది. ఈ వ్యూహానికి మరింత పదును పెట్టనుంది.
అక్కడ సొంత ఎమ్మెల్యేలపై వేటు, వైసిపి కసరత్తు
తమిళనాడులో సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, మరొక వర్గానికి చెందిన సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పి ధిక్కరించినందుకే, పార్టీ ధిక్కరణ కింద స్పీకర్ ఆ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దీంతో ఇప్పుడు వైసిపి కూడా కసరత్తు ప్రారంభించింది.
నిలదీయనున్న వైసిపి
అక్కడి ఎమ్మెల్యేలు కేవలం సీఎంకు ఓటు వేయమని చెప్పినందుకే ధిక్కరణ కింద వేటు వేస్తే, ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో పార్టీ మారి, కేబినెట్లో చేరినా చర్యలు తీసుకోకపోవడాన్ని వైసిపి గట్టిగా నిలదీయనుంది. ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు తమిళనాడు, ఏపీ పరిస్థితులను ప్రజలకు చెప్పనుంది.
దేశవ్యాప్తం చేయాలని వైసిపి నిర్ణయం
తమిళ స్పీకర్ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని వైసిపి నిర్ణయించింది. కాగా, అనర్హతపై తక్షణం స్పందించి తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపిలోనూ అమలుచేసి, పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసిపి మళ్లీ తాజాగా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఇక్కడా వెళ్లవచ్చు
తమిళనాడు స్పీకర్ తక్షణమే స్పందించి పార్టీ ధిక్కరణ కింద 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, ఏపీలో మాత్రం స్పీకర్ నెలల తరబడి ఆ కేసును నాన్చుతున్నారని, అనర్హత వేటు వేయాలంటే విప్ జారీ చేయాల్సిన పనిలేదని, ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి మరో పార్టీ జెండా కప్పుకున్నా, అనర్హుడేనన్న సుప్రీం తీర్పును ఏపి స్పీకర్ పాటించకపోవడం విచారకరమని, తమిళనాడు స్పీకర్ నిర్ణయాన్ని చూసైనా ఏపి స్పీకర్ స్పందిస్తే ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని ప్రజలు విశ్వసిస్తారని, తమిళనాడు స్పీకర్ నిర్ణయాన్ని తమ వాదనకు మద్దతుగా ఎవరైనా కోర్టుకు వెళ్లి, ఏపిలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు వేయవచ్చునని అంటున్నారు.
కోర్టుల్లోనే తేల్చుకుంటాం
కాగా, తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ స్పీకర్కు కనువిప్పు కావాలని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సొంత పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేస్తామంటేనే అక్కడి స్పీకర్ పార్టీ ధిక్కరణ కింద అనర్హత వేటు వేస్తే, మరి ఇక్కడ పార్టీలు మారి మంత్రులు కూడా అయిన ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, దీన్ని కోర్టుల్లోనే తేల్చుకుంటామన్నారు.