పోస్టర్ బాయ్ కార్తీక్ 'నటరాజన్' ప్రాణం నిలబెట్టాడు: బిడ్డ ఎలాగు తిరిగి రాడని!..
పోస్టర్ బాయ్ ముగ్గురి ప్రాణాలను నిలబెట్టాడు. అతని తల్లిదండ్రుల ఔదార్యం వల్ల అన్నాడీఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి వీకె శశికళ భర్త నటరాజన్(74) ప్రాణం కూడా నిలబడింది.
చెన్నై: పోస్టర్ బాయ్ ముగ్గురి ప్రాణాలను నిలబెట్టాడు. అతని తల్లిదండ్రుల ఔదార్యం వల్ల అన్నాడీఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి వీకె శశికళ భర్త నటరాజన్(74) ప్రాణం కూడా నిలబడింది.
రాజకీయ పార్టీల పోస్టర్లు అంటించి పొట్ట పోసుకునే ఆ యువకుడి జీవితాన్నిరోడ్డు ప్రమాదం చిధ్రం చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు ముందుకురావడంతో ముగ్గురి ప్రాణాలు నిలబడ్డాయి.
ఎవరా పోస్టర్మాన్?:
తమిళనాడులోని పుదుకోటజిల్లా అరంతాంగి సమీపంలోని కూత్తాడివయల్ అనే గ్రామానికి చెందినవాడు కార్టీక్(19). ఓ ప్రింటింగ్ ప్రెస్లో దినసరి కూలీగా పని చేస్తూ.. రాజకీయ పార్టీల పోస్టర్లు అంటిస్తుంటాడు. గత సెప్టెంబరు 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
మీ బిడ్డ ఎలాగు తిరిగి రాడు.. :
ప్రమాదం తర్వాత కార్తీక్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు చెప్పారు. ఆ తర్వాత కొంత సేపటికే కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు.
'మీ బిడ్డ ఇక తిరిగిరాడు.. కానీ, ఆయన అవయవాలను దానం చేస్తే.. మరికొందరికి జీవితం ప్రసాదించినవారవుతారు' అని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు అతని తల్లిదండ్రులకు సూచించారు.
నటరాజన్కు అవయవ దానం:
అవయవ దానానికి కార్తీక్ తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో రాష్ట్ర అవయవాల మార్పిడి సంస్థ అధిపతి డాక్టర్. పి. బాలాజీ ఆస్పత్రికి చేరుకున్నారు. కార్తీక్ దేహం నుంచి ఆరోగ్యవంతమైన అవయవాలను సేకరించారు. ఈ అవయవాలను ఆ మరుసటి రోజు నటరాజన్ సహా ముగ్గురు రోగులకు అమర్చారు.
నటరాజన్కు కాలేయం, కిడ్నీలు, రాష్ట్రానికి చెందిన మరో రోగికి గుండెను, ఊపిరితిత్తులను ఆంధ్రప్రదేశ్కు చెందిన 62ఏళ్ల వృద్ధునికి అమర్చారు. గత తొమ్మిది నెలలుగా అన్నాడీఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ కాలేయం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఆదుకోవాలని:
కార్తీక్ కుటుంబం దుర్భర పరిస్థితుల్లో ఉందని, అవివాహితగా ఉన్న అతని సోదరుడికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కార్తీక్ బావ కోరుతున్నాడు. పేదరికంలో ఉన్న తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.