బాలయ్యకు షాక్
జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆయనను కూడా దూరంగా పెట్టాలనే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు వచ్చినప్పుడు వారి సేవలను వినియోగించుకోవడం తప్ప పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వకూడదనేది చంద్రబాబు అభిమతమని అంటున్నారు. పార్టీలో స్వర్గీయ ఎన్టీఆర్ వారసులకు క్రియాశీలక పాత్ర ఇస్తే తనకు ప్రమాదమని చంద్రబాబు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్ల ఆయన ఎన్టీఆర్ వారసులను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని భావిస్తున్నారని సమాచారం. ఇటీవల వారసత్వ రాజకీయాలకు దూరమని చేసిన ప్రకటన లోకేష్ నో, జగన్ నో ఉద్దేశించి చేసింది కాదని, బాలయ్యను పార్టీ కమిటీలోకి తీసుకునే ఉద్దేశంలేకనే ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదిలా వుంటే, పార్టీ పోలిట్ బ్యూరోలోకి టి. దేవేందర్ గౌడ్ ను, తలసాని శ్రీనివాస యాదవ్ ను తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దేవేందర్ గౌడ్ విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డి తనకు పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలని కోరుతూ దేవేందర్ గౌడ్ కు స్థానం కల్పించకూడదని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చినవారికి, పార్టీపై ఇంతకు ముందు విమర్శలు చేసేవారికి పార్టీ కమిటీల్లో స్థానం కల్పించవద్దని ఆయన చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ కు చెక్ పెట్టడానికే హరీశ్వర్ రెడ్డి ఈ డిమాండ్ పెడుతున్నట్లు సమాచారం. ఏమైనా పార్టీ కమిటీల కసరత్తు చంద్రబాబుకు అంత సులభమైన పనేం కాదని అంటున్నారు.