మహా వెన్నుపోటు?
"సీట్లివ్వని బాబు రేపు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాడా?" అని టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు సీట్ల సర్దుబాటులో పొరపొచ్చాలు వచ్చినప్పుడు మీడియా ముందు చేసిన వ్యాఖ్య ఇది. టీఅర్ ఎస్ సీట్ల అవసరం లేకుండా బాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణ ఇస్తాడా అని ఇప్పుడు టీఅర్ ఎస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలివిడతగా తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే మహాకూటమి రైలు నుంచి టీఅర్ ఎస్ బోగీ తెగిపోయినట్టయింది. కెసీఆర్ ను వెంటేసుకుని ఆంధ్రాలో ప్రచారం చేయడం బాగుండదు కాబట్టి టిడీపి, వామపక్షాల నాయకులే ఆంద్ర్రా, రాయలసీమల్లో ప్రచారం చేసుకున్నారు.
మరో వైపు చంద్రబాబు తన పార్టీకి చెందిన ఆంధ్ర, సీమ నాయకులతో "తెలంగాణ" అంశాన్ని లైట్ గా తీసుకోమని రహస్యంగా చెబుతున్నట్టు తెలిసింది. మనం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ అంశాన్ని నిర్లక్ష్యం చేయవచ్చని చంద్రబాబు ఆశగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన జిల్లా నాయకులకు ఫోన్లు చేసి వివరిస్తున్నారు. అయితే చంద్రశేఖరరావుకు బాబు ఎత్తులను ముందుగా గ్రహించగల శక్తి ఉంది. అందుకే ఆయన తనకు రాబోయే ఐదారు ఎంపీ స్ధానాలతోనే కేంద్రంలో ప్రభావం చూపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చూడాలనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తెలంగాణ సాధించుకోవాలన్నది ఆయన ఆలోచనగా కన్పిస్తోంది.