జనంతో ఆటలాడుతారా?
వైఎస్ రాజశేకరరెడ్డి లక్ష కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకున్నాడని చంద్రబాబు, ఆయనకు వంత పాడే వామపక్షాల నాయకులు విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని, భూముల పదేరం ఆయన నుంచే ప్రారంభమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తారు.
ఏది సత్యం? ఏది అసత్యం? ఈ విషయాలను ఎవరు నిర్ధారించాలి? ఎవరు తక్కువ దొంగో ఆలోచించుకుని ఓట్లు వేయాల్సిన పరిస్ధితి జనానికి దాపురించింది. కోట్లాది రూపాయలతో పార్టీ టికెట్లు కొనుక్కుని, ఆ తర్వాత మందుతో, డబ్బుతో ఓట్లు కొనుక్కునే నాయకులు ప్రజలకు ఏం చేస్తారు? రాజకీయాన్ని వ్యాపారంతో ముడి పెట్టుకునే నాయకులకు ఆనాటి స్వాతంత్ర్య సమరం గురించి తెలుసా?
ఈసారి ఎన్నికల సంగ్రామంలో నీతి, అవినీతి ప్రధానాంశాలైతే సామాన్య జనం ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతికి, అవినీతికి మధ్య రేఖలను చెరిపేసిన వారే ఈ రాజకీయ నాయకులు. అయితే రెడ్ల కాంగ్రెస్ నో, కాకపోతే కమ్మ తెలుగుదేశాన్నో, లేదంటే కాపు ప్రజారాజ్యాన్నో గెలిపించుకోవాలా? రాజకీయాల్లో కులమే ప్రధాన పాత్ర వహిస్తున్నప్పుడు వెనుకబడిన కులాల వారు ప్రేక్షక పాత్ర వహించాలా? ఒక మూడు కులాల వారే రొటేషన్ లో రాష్ట్రాన్ని పరిపాలించాలా? ఆలోచించండి. కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచించండి.