రెండు చోట్లా కష్టమేనా?
చిరంజీవి ఆదివారం నాడు మీడియా ముందు చేసిన ప్రకటనలను బట్టి ఆయన గెలుపుపై ఎంత ఆందోళన చెందుతున్నారో స్పష్టమవుతోంది. తిరుపతిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరనున్నట్టు చిరంజీవి చెప్పారు. తిరుపతిలో తనను ఓడించేందుకు కడప, పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ గూండాలను దించిందని చిరంజీవి ఆరోపించారు. దీనికి తోడు చేగొండి హరిరామ జోగయ్య చేసిన దూలగొండి ప్రకటన చిరంజీవి మరింత ఇబ్బందుల్లో పడేసింది. రెండు స్ధానాల నుంచి చిరంజీవి గెలిచినా పాలకొల్లు స్ధానాన్ని ఉంచుకుని తిరుపతి స్ధానానికి పోటీ చేస్తారని ఆయన పదే పదే ప్రకటించడం వల్ల చిరును గెలిపించుకుని లాభమేమిటని తిరుపతి ఓటర్లు అనుకునే పరిస్ధితి ఏర్పడింది.
చిరంజీవి ఏ స్ధానం ఉంచుకుంటారన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అల్లు అరవింద్ ప్రకటించినా, తిరుపతి ఓటర్లలో అనుమానాలు పోవడం లేదు. పాలకొల్లులో పరిస్ధితి మరో విధంగా ఉంది. ఇక్కడ ఎస్ సి, బిసి ఓట్లు అత్యధికంగా ఉన్నాయి.సంప్రదాయ సిద్ధంగా ఎస్ సిలు కాంగ్రెస్ కు, బీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ వస్తున్నారు. ఈసారీ అదే జరిగితే చిరు గెలుపు చాలా కష్టమైపోతుందని స్ధానిక పీఆర్పీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.