తానొక్కటి తలిస్తే...
వైయస్ జగన్ కు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పడానికి, పార్లమెంటు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పార్టీ అధిష్ఠాన వర్గం ముందు పెట్టడానికి ఇతర మార్గాలు ఉన్నప్పుడు వీధికెక్కి బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో వ్యవహరించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ అధిష్ఠానవర్గానికే కాకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియానే సవాల్ చేసే విధంగా వ్యవహరించారని అంటున్నారు. ఆలస్యం అమృతం విషం అనే విషయాన్ని ఒంట బట్టించుకున్న కెవిపి రామచందర్ రావు తొందర పడి ముందే వీధులకు లాగడం ద్వారా రేఖను దాటారని పార్టీ అధిష్ఠాన వర్గం భావిస్తోందని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల పార్టీ అధిష్ఠాన వర్గానికి, సోనియాకు కృతజ్ఞతా భావం ఉందని, దాన్ని వ్యక్తం చేయడానికి, దాన్ని చూపించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని రీతిలో కెవిపి రామచందర్ రావు వ్యవహరించారని అంటున్నారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే తాము లొంగిపోయిన విధంగా ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా బ్లాక్ మెయిలింగ్ విధానాలు మొదలవుతాయని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా, రాష్ట్రానికి చెందిన ఇతర నాయకుల ఉనికిని కూడా ప్రశ్నించే విధంగా వైయస్ వర్గీయులు వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే దీర్షకాలికంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రానికి చెందిన ఇతర నాయకులు చాలా మంది తిరుగుబాటు చేసే అవకాశం ఉందని, ఈ తిరుగుబాటు వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని అంటున్నారు. ఈ స్థితిలో కెవిపి రామచందర్ రావు వ్యూహానికి తలొగ్గకపోవడమే ఎందుకైనా మంచిదనే అభిప్రాయం అధిష్ఠాన వర్గంలో బలపడిందని అంటున్నారు.