ఎన్టీఆర్ ఆత్మ సూపర్ స్టార్!
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వాడుకోడానికి కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తోంది. ఆ టీవీ యాడ్ కు కాంగ్రెస్ "సత్యపీఠం' అని నామకరణం చేసింది. ఆ యాడ్ లో ఎన్టీఆర్ 1995 లో తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై ఆ సమయంలో ఎన్టీఆర్ చేసిన విమర్శల ఆడియో కేసెట్ ను చక్కగా వాడుకున్నారు. ఎన్టీఆర్ విజువల్ తో ఆయన చంద్రబాబు మీద చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు టీవీ యాడ్స్ లో కనిపిస్తున్నాయి. చంద్రబాబు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని ఎన్టీఆర్ మాటల సారాంశం. ఎన్టీఆర్ ఆనాడు అన్న ఆ మాటలు నిజమైనవే. అవి పద్నాలుగేళ్ళ నాడే జెమిని టీవీలో ప్రసారమయ్యాయి.
ఇక చంద్రబాబు నాయుడు ఈ యాడ్ కు కౌంటర్ వేయవలసి వచ్చింది. అందుకని ఎన్టీఆర్ ను ఒక పౌరాణిక పురుషుడిగా, వైఎస్ ను ఒక భక్తుడిగా చూపిస్తూ ఒక యాడ్ ను రూపొందించారు. వైఎస్ ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను పొగుడుతూ ఉంటాడు. అయినా చివర్లో ఆగ్రహించిన ఎన్టీఆర్ వైఎస్ ను ఇడుపులపాయ వెళ్ళిపో అని శపిస్తాడు.
ఈ యాడ్స్ ప్రజలకు ఏవగింపు కలిగించక మానవు. ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను ఉభయ పార్టీలూ వాడుకోవడం దారుణం. ఒక మహానటుడికి, ఒక మహా నాయకుడికి ఆత్మ శాంతి కలుగకుండా అటు అల్లుడు చంద్రబాబు, ఇటు వైఎస్ ఇలా చేయడం హర్షించదగిన విషయం కాదు. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ తో కాకుండా ఆయన ప్రియ కుమార్తె పురంధేశ్వరితో, తెలుగుదేశం వాళ్ళు మైసూరారెడ్డితో టీవీ యాడ్స్ రూపొందించుకుంటే బాగుండేది. పురంధరేశ్వరి చంద్రబాబుని, మైసూరా వైఎస్ ని చెలిగేసి ఉండేవారు. జనానికి చక్కటి లైవ్ వినోదం లభించి ఉండేది.