పురంధరేశ్వరికి బహిరంగలేఖ
2004 ఎన్నికల్లో కమ్మ కులస్ధులు కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఒక కారణం దగ్గుబాటి దంపతులు చంద్రబాబు నాయుడితో వేగలేక కాంగ్రెస్ లో చేరడం. కోస్తా ఆంధ్రలో కమ్మవారు చంద్రబాబు మీద ఆగ్రహంతో మరో దిక్కులేక కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు.
సరే, ఒకే కుటుంబంలోని వారు వివిధ పార్టీల్లో ఉండవచ్చా? తద్వారా వారు తమ కుటుంబ ఆధిపత్యాన్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడికి సహకరించారనడం జగమెరిగిన సత్యం. ఆనాడు చంద్రబాబుకు మద్దతు ఇవ్వమంటూ దగ్గుబాటికి వీరతిలకం పెట్టి వైస్రాయ్ హోటల్ కు పంపిన పురంధరేశ్వరి ఈనాడు మాటి మాటికీ ఎన్టీఆర్ ను గుర్తుచేసుకోవడం దారుణం.
చంద్రబాబు నాయుడి రాజకీయ స్వార్ధం గురించి అందరికీ తెలుసు. సొంత జిల్లాలో తమ్ముడు రామూర్తి నాయుడి ఎదుగుదలను కూడా తట్టుకోలేని నైజం ఆయనది. ఇక తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు శ్రేయస్సును ఆయన ఎందుకు కోరుకుంటారు? అందువల్లనే కమ్మ పెద్దలు ఒక సిండికేట్ గా ఏర్పడి సోనియా గాంధీతో మాట్లాడి దగ్గుబాటి దంపతులకు కాంగ్రెస్ పార్టీలో ఒక గౌరవనీయమైన స్ధానం కల్పించారు.
అయితే ఒక పెద్ద కుటుంబంలోని వారు రెండు ప్రత్యర్ధి పార్టీల్లో పెత్తనం చెలాయిస్తూ, అంతర్గతంగా కలిసి ఉండడం సామాన్య ప్రజలను మోసగించడం కాదా? జనం ఎవరిని నమ్మాలి? దీని మీద చర్చ జరగాల్సిన అవసరముంది.