చిరు గాలి కాదు హోరు గాలి!
మహాకూటమి, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేని పరిస్థితిలో ఆ ఇద్దరూ తమ వద్దకు రాక తప్పదనేది ప్రరాపా అంచనా. 'కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే సీఎం అయ్యే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది. కాంగ్రెస్కు మెజారిటీ వస్తే వైఎస్ అవుతారు. ఇందులో వేరే అభిప్రాయంలేదు. వాళ్ళు గద్దెనెక్కే పరిస్థితి లేనప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఆ పదవిలోకి రాకుండా అడ్డుకోవాలనే చూస్తారు. ఇదే మాకు ఆయుధం' అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పైనుంచి కిందిస్థాయి వరకు ప్రరాపా నేతలంతా చిరంజీవి సీఎం అవుతారంటూ ఒకే పల్లవి వినిపిస్తున్నారు. తమకు లోక్సభ స్థానాలు కూడా బాగానే వస్తాయనేది చిరంజీవి నమ్మకం. అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తిరుపతి, నంద్యాల, రాజంపేట స్థానాలు తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. విశాఖ, తిరుపతి, మల్కాజ్గిరి వంటి మరొకొన్ని స్థానాల్లోనూ అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. తమకొచ్చే లోక్సభ స్థానాలతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామనేది ప్రరాపా నేతల ఆశ. అది రాష్ట్రంలో ప్రరాపా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజారాజ్యం ఎవరికీ మద్దతు ఇవ్వదని, చిరంజీవి ముఖ్యమంత్రి కావడానికి అవసరమైతే తామే ఇతరుల మద్దతు తీసుకుంటామని పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అధినేత సీఎం కావడం ఖాయమని శనివారమిక్కడ విలేఖరులతో చెప్పారు. '16న ఫలితాలు వెలువడతాయి. ఆ రోజు ఒకరకంగా ప్రరాపాకు స్వయం వరంలాంటిది. ఎవరితో కలిసి వెళ్లాలో అప్పుడే నిర్ణయం తీసుకుంటాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రువులు ఎవరూ ఉండరు. నాతో తెలుగుదేశం నేతలు నాగం జనార్దనరెడ్డి, బి.గోపాలకృష్ణారెడ్డి తదితరులు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లోని కొంతమంది ముఖ్యనేతలు కూడా మాట్లాడుతున్నారు' అని తెలిపారు.