రోజా బేరాలు
కరుణాకర్ రెడ్డికి, రోజా సోదరుడికి మధ్య మంచి సంబంధాలున్నాయి. రోజా సోదరుడు కూడా గత కొంత కాలంగా కాంగ్రెస్ లో చేరాలంటూ రోజా పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా రోజా కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. రోజా తెలుగుదేశంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు తగిన గుర్తింపు, క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె పలు ఆందోళనలు చేపట్టారు. పదునైన వాగ్ధాటితో ఆకట్టుకునే గుణం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అందుకే రాజశేఖర రెడ్డి పట్టుబట్టి ఆమెను కాంగ్రెసులోకి తీసుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాను కాంగ్రెసులో చేరబోనని, తాను కాంగ్రెసులోకి వెళ్లడానికి రాయబారాలు నడుపుతున్నట్లు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారో తనకు అర్థం కావడం లేదని రోజా గతంలో అన్నారు. తను తగిన హామీలు పొందడానికే ఈ వ్యూహాన్ని ఆమె ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. తనకు తగిన హామీలు రావడంతో ఆమె కాంగ్రెసులో చేరడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.